హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర విద్యాశాఖ శిక్షణా పరిశోధనాసంస్థ (ఎస్సీఈఆర్టీ)ను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంస్థలోని డిప్యుటేషన్లు, ఆన్డ్యూటీ (ఓడీ)లను రద్దుచేసింది. డిప్యుటేషన్పై రెండేండ్లు, ఆన్డ్యూటీపై ఏడాదికి పైగా పనిచేస్తున్న సిబ్బందిని ఆయా స్థానాల నుంచి తొలగించి వారి వారి పాత స్థానాల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీచేశారు. డిప్యుటేషన్పై రెండేండ్లలోపు, ఓడీపై ఏడాదిలోపు ఉన్న వారికి మినహాయింపు ఇచ్చారు. దీంతో డిప్యుటేషన్లు, ఓడీలపై కొనసాగుతున్న 50 మంది ఉద్యోగులకు వేటు పడే అవకాశాలున్నాయి. భవిష్యత్తులో నోటిఫికేషన్నే ఉత్తర్వుల్లో సూచించారు.
ఎస్సీఈఆర్టీ కార్యకలాపాలపైనా ప్రభుత్వం సమీక్షించించి, పలు సూచనలు జారీచేసింది. సంస్థ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తంచేసి దిశానిర్దేశం చేసింది. ప్రాజెక్ట్లు, కార్యక్రమాలను ఇకనుంచి ఎస్సీఈఆర్టీ నేరుగా పర్యవేక్షించొద్దని ఆదేశించింది. విద్యా శిక్షణాకార్యక్రమాలు, మూల్యాంకనం, పరిశోధనలు, అధ్యయనాలు, మెటీరియల్ రూపకల్పనను ప్రభు త్వ నుంచి ముందుగా అనుమతి పొందాకే చేపట్టాలని సూచించింది. ఎస్సీఈఆర్టీ పరిశోధన, వనరులు సమకూర్చే సంస్థగా మాత్రమే సేవలందించాలని పేర్కొన్నది. ఈ ఆదేశాల అమలుపై ఫిబ్రవరి 1లోపు నివేదిక ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.