పూర్తిగా అవాస్తవం..
డిస్కంలపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. అవాస్తవాలతో తెలంగాణ ప్రజల్లో గందరగోళం సృష్టిద్దామనుకొంటున్నారో.. ఏమో. మనకు రావాల్సిన విద్యుత్తును ఏపీ ఇవ్వకపోవడం, కేంద్రం చేసిన చట్టాలు, తీసుకున్న పాలసీలు కలిసి మనకు పెను భారంగా పరిణమించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినదానికన్నా అదనంగా రూ.9 వేల కోట్లకుపైగా సబ్సిడీ ఇచ్చింది. ఇక మన స్థాపిత విద్యుత్తు సామర్థ్యం రాష్ట్రం వచ్చినప్పటితో పోల్చుకొంటే రెట్టింపునకు పైగా అయ్యింది. కేవలం 812 మెగావాట్లు అని మాత్రమే ఆ వార్తలో రాసింది. ఆఖరికి.. నా ఆరోగ్యం బాగా లేక.. పరీక్షలు చేయించుకోవడానికి, చికిత్స తీసుకోవడానికి సెలవు పెడితే.. అలిగి సెలవుపై వెళ్ళారని వార్త రాయడం చాలా బాధాకరం. దేశ వ్యాప్తంగా రెండు రాష్ర్టాలు మినహా.. అన్ని రాష్ర్టాల్లోని అన్ని డిస్కంలు సుమారు రూ.1.20 లక్షల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. ఇవన్నీ పక్కనపెట్టి.. నిజాలను కాకుండా.. అవాస్తవాలను ప్రచురించడం కడు శోచనీయం.
దేవులపల్లి ప్రభాకర్రావు, సీఎండీ, ట్రాన్స్కో, జెన్కో
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): నువ్వెన్నన్నా చెప్పు.. నేను చెప్పిందే రైటు.. నేను చెప్తున్నా కదా.. నీకు రాష్ట్రమిస్తే చీకట్లు కమ్ముకుంటాయని.. నేను చెప్పాను కదా.. నువ్వు నష్టాల్లో ఉన్నావని.. నేను చెప్పాను కదా.. మీ సీఎండీ అలిగి ఇంటికిపోయాడని.. నేను చెప్తున్నా కదా.. మీ డిస్కంలు సంక్షోభంలో మునిగిపోయాయని, నేను చెప్తున్నా కదా.. మీ స్థాపిత సామర్థ్యం ఇంతే పెరిగిందని.. ఆంధ్రజ్యోతి దినపత్రిక అచ్చొత్తించే కొన్ని మాటలివి.. మొదట్నుంచీ తెలంగాణ అంటే ఆ పత్రికాధిపతికి ఒళ్లంతా కంపరమే. ‘ప్రత్యేక తెలంగాణ వస్తే మీరు అంధకారంలో మునిగిపోతారు’ అని అప్పటి సీమాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కర్ర పట్టుకొని మ్యాపులో చూపించి తెలంగాణను భయపెట్టేందుకు ప్రయత్నిస్తే.. ఆ మాటలు నిజం కావాలని.. ఇక్కడ జ్యోతులు వెలుగరాదని గుండెలనిండా కసి పెట్టుకొన్న జ్యోతికి.. దేదీప్యమానంగా వెలుగుతున్న తెలంగాణను చూసి కండ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఓ పక్క దేశవ్యాప్తంగా విద్యుత్తు సంక్షోభం నెలకొన్నది. మరోపక్క తనకు ప్రీతిపాత్రమైన ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కోతలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఒక్క తెలంగాణలోనే ఒక్క క్షణం కోత కూడా లేకుండా అద్భుతంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా అవుతున్నది. దీన్ని తట్టుకోలేక.. ప్రజల్లో గందరగోళాన్ని, భయాందోళనలను సృష్టించేందుకు కొత్త తప్పుడు కథలు వండి వారుస్తున్నది. శనివారం ఆంధ్రజ్యోతి దినపత్రిక మొదటి పేజీలో వచ్చిన ‘విజయం వెనుక విషాదం’ అన్న శీర్షికతో వచ్చిన కథనం.. పుట్టెడు అబద్ధాలను నిజాలుగా చూపించడానికి చేసిన కుట్ర అని రాష్ట్ర జెన్కో, ట్రాన్స్కో విడుదల చేసిన ప్రకటన స్పష్టంచేసింది.
ఆంధ్రజ్యోతి అబద్ధం
విద్యుత్తు నష్టాలు భారీగా పెరుగుతున్నాయి.. కానీ తగ్గడం లేదు.
ఇదీ వాస్తవం
తెలంగాణలో ట్రాన్స్మిషన్ నష్టాలు కేవలం 2.47 శాతం మాత్రమే. డిస్ట్రిబ్యూషన్, సాంకేతిక నష్టాలు 10 శాతం లోపే.. దేశంలోనే అతి తక్కువ నష్టాలున్న రాష్ర్టాల్లో మన తెలంగాణ ఒకటి. తెలంగాణ వచ్చిన తరువాత 24 గంటలపాటు నిరంతరాయంగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు విద్యుత్తును కేవలం 6 నెలల్లోనే ఇవ్వగలిగారు. వ్యవసాయానికి 24 గంటల నిరంతరాయ ఉచిత విద్యుత్తును ఇచ్చేందుకు.. రూ.32,194 కోట్లతో ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను బలోపేతంచేశారు.
ఆంధ్రజ్యోతి అబద్ధం..
గడిచిన ఏడేండ్లలో కేవలం 812 మెగావాట్లు మాత్రమే స్థాపిత సామర్థ్యం పెరిగింది..
ఇదీ వాస్తవం
తెలంగాణ ఏర్పడిన తరువాత.. 8,825 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని అదనంగా సాధించింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు మన స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 7,788 మెగావాట్లు. ఏడేండ్ల తరువాత మన స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 16,613 మెగావాట్లు. తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో విద్యుత్ సామర్థ్యం 4,365 మెగావాట్ల నుంచి 6,215 మెగావాట్లకు పెరిగింది. స్టేట్ సెక్టార్లో 3,770 మెగావాట్ల స్థాపిత విద్యుత్తు సామర్థ్యం పెరిగింది. థర్మల్ విషయానికి వస్తే.. కేటీపీపీ 600 మెగావాట్లు, కేటీపీఎస్ (7వ యూనిట్) 800 మెగావాట్లు, భద్రాద్రి థర్మల్ విద్యుత్కేంద్రం (బీటీపీఎస్) 810 మెగావాట్లు, సింగరేణి (ఎస్టీపీపీ) 1,200 మెగావాట్ల సామర్థ్యం పెరగ్గా.. జల విద్యుత్తు.. జూరాలలో 240 మెగావాట్లు, పులిచింతలలో 120 మెగావాట్లు ప్రారంభించారు. రాష్ట్రం వచ్చినప్పుడు సౌర విద్యుత్తు సామర్థ్యం కేవలం 74 మెగావాట్లు ఉంటే.. ఇప్పుడు 3,913 మెగావాట్లకు పెరిగింది. ఆంధ్రజ్యోతి చెప్పినట్టుగా.. 812 మెగావాట్లు మాత్రమే పెరిగిందా.. 8,825 మెగావాట్లు పెరిగిందా అనేది ఈ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి అబద్ధం..
డిస్కంలు పోటీపడి నష్టాలు మూటగట్టుకుంటున్నాయి.. 2014-15 లో రూ. 2,512 కోట్ల నష్టాలే ఉన్నాయి..
ఇదీ వాస్తవం
రాష్ట్రం ఏర్పడినప్పుడు డిస్కంల నష్ట్టాలు మొత్తం రూ.12,815 కోట్లు. మరి ఆంధ్రజ్యోతి పేర్కొన్న గణాంకాలెక్కడివో.. ఈ నష్టాలకు కూడా కారణం ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలదే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత.. ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందూజా, కృష్ణపట్నంతో కుదుర్చుకొన్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)ను రద్దు చేసింది. దీనివల్ల తెలంగాణ డిస్కంలకు రూ.2,763 కోట్ల మేర విద్యుత్తును బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఏపీ పీపీఏలు రద్దు చేసుకుంటే.. ఆ భారం మనం మోయాల్సి వచ్చింది. అంతేకాదు.. ఏపీ జెన్కో జల విద్యుత్తు కేంద్రాల నుంచి విద్యుత్తు సరఫరాను నిలిపివేసింది. దీంతో సుమారు రూ.2,502 కోట్ల అదనపు భారాన్ని తెలంగాణ డిస్కంలు భరించాల్సి వచ్చింది. ఇక మాచ్ఖండ్, తుంగభద్ర లాంటి అంతర్రాష్ట్ర విద్యుత్తు ప్రాజెక్టుల నుంచి మనకు రావాల్సిన 76.31 మెగావాట్ల విద్యుత్తును కూడా ఇవ్వలేదు. దీనితో రూ.398 కోట్ల భారాన్ని తెలంగాణ మోయాల్సి వచ్చింది.
కేంద్రం నిర్వాకమిదీ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు, పాలసీల వల్ల మనకు కలిగిన నష్టాన్ని చూద్దాం… క్లీన్ ఎనర్జీ సెస్ పేరిట టన్ను బొగ్గుపై రూ.50 ఉన్నదాన్ని కాస్తా.. రూ.400 లకు పెంచింది. దీనివల్ల ప్రతి యూనిట్పై 24 పైసల చొప్పున అదనపు భారం మనపై పడిందని ‘ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్’ రిపోర్ట్ విశ్లేషణ స్పష్టంగా పేర్కొన్నది. తెలంగాణ డిస్కంలు 50,000 మిలియన్ల యూనిట్ల విద్యుత్తును థర్మల్ యూనిట్ల నుంచి కొనుగోలు చేశాయి. దీనివల్ల ప్రతియేటా రూ.1,200 కోట్ల చొప్పున డిస్కంలపై ఇప్పటి వరకు సుమారు రూ.8,400 కోట్ల భారం పడింది. అలాగే కేంద్రం ప్రతి యేటా బొగ్గు ధరను 6 నుంచి 10 శాతం వరకు పెంచుతూ వస్తున్నది. ఇది తెలంగాణ విద్యుత్తు సంస్థలపై అదనపు భారంగా పరిణమించింది. రైల్వే రవాణా చార్జీల భారం గడిచిన నాలుగేండ్లలో 40 శాతం పెరిగింది. దీనికి తోడు రెన్యూవబుల్ ఎనర్జీని నిర్దేశిస్తూ పాలసీ చేయడంతో.. థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) తగ్గుతూ వస్తున్నది. దీంతో థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ధర పెరుగుతున్నది.
ఆంధ్రజ్యోతి అబద్ధం
తెలంగాణ ప్రభుత్వం ఒక్క పైసా అదనంగా ఇవ్వటం లేదు. ఉద్యోగుల జీతభత్యాలు పెరిగిపోతున్నాయి.
ఇదీ వాస్తవం
సాధారణంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతోపాటు.. గడిచిన ఐదేండ్లలో (2016-17 నుంచి 2020-21 వరకు) అదనంగా రూ.9,161 కోట్లను ప్రభుత్వం డిస్కంలకు ఇచ్చింది. దీనితో పాటు అన్ని విద్యుత్తు సంస్థల్లో ఉన్న 23,667 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. దేశంలో తెలంగాణ మాత్రమే ఇలా రెగ్యులరైజ్ చేసింది.
ఆంధ్రజ్యోతి అబద్ధం
అదనపు సాయం కావాలంటూ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు ప్రతిపాదిస్తే.. ఫైలును విసిరి కొట్టారా? ఆ మనో వేదనతోనే సీఎండీ సెలవు పెట్టారా?.
ఇదీ వాస్తవం
ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు తనకు అనారోగ్యం కారణంగా మొదట్లో సుమారు 20 రోజులపాటు సెలవు పెట్టారు. తరువాత విధులను తిరిగి చేపట్టారు. అయితే వైద్యుల సలహామేరకు మరిన్ని పరీక్షలు, చికిత్స తీసుకోవాల్సి రావడంతో మరో నెలన్నరపాటు సెలవు పెట్టి పూర్తిస్థాయిలో రికవరీ అయ్యారు. నిజానికి నవంబర్ 11 తారీఖు వరకు సెలవు ఉన్నప్పటికీ.. రెండు రోజుల ముందుగానే అంటే నవంబర్ 9వ తారీఖునాడే సీఎండీ ప్రభాకర్రావు విధుల్లో చేరడం గమనార్హం.
ఆంధ్రజ్యోతి అబద్ధం
ఏడేండ్లలో రూ.2 వేల కోట్ల నుంచి రూ.42 వేల కోట్లకు డిస్కంల నష్టాలు పెరిగాయి.
ఇదీ వాస్తవం
రాష్ట్రం ఏర్పడేనాటికే డిస్కంల నష్టాలు రూ.12,815 కోట్లు. దీనికితోడు సాధారణంగా ఇచ్చే సబ్సిడీతోపాటు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు అదనంగా రూ.9 వేల కోట్లకుపైగా సబ్సిడీని ఇచ్చింది. ఈ రెండిటినీ మినహాయిస్తే పెరిగిన నష్టం రూ.21 వేల కోట్లు మాత్రమే. మరి రూ. 42 వేల కోట్ల నష్టాలు ఎక్కడివనేది ఆ పత్రికే చెప్పాలి. దేశ వ్యాప్తంగా చూసుకుంటే.. హర్యానా, గుజరాత్ రాష్ర్టాలు మినహా.. అన్ని రాష్ర్టాల డిస్కంలు నష్టాల్లోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డిస్కంల నష్టాలు సుమారు రూ.1.20 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా.
తెలంగాణ ఘనతలు..
2020-21లో తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం 2012 యూనిట్లు. అదే దేశ వ్యాప్తంగా తలసరి విద్యుత్తు వినియోగం 1161 యూనిట్లు మాత్రమే. అంటే దేశ సగటు కంటే.. తెలంగాణ సగటు 73 శాతం ఎక్కువ. అభివృద్ధి చెందుతుందనేందుకు పరిగణలోకి తీసుకునే అంశాల్లో తలసరి విద్యుత్తుకూడా ఒకటి.
దేశంలో ఏ రాష్ట్రంకూడా వ్యవసాయానికి 24 గంటలపాటు పూర్తి ఉచిత విద్యుత్తు ఇవ్వడం లేదు. కేవలం తెలంగాణ మాత్రమే 25.37 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు పూర్తి ఉచిత విద్యుత్తును 24 గంటలపాటు సరఫరా చేస్తోంది. గుజరాత్రాష్ట్రం కూడా రోజుకు 8 గంటలపాటు విద్యుత్తును వ్యవసాయానికి అందిస్తూ.. యూనిట్కు రూ. 0.60 పైసల చొప్పున వసూలు చేస్తున్నది. అన్ని వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించింది.