హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.600 కోట్ల ప్రతిపాదనలకు అటవీకరణ ప్రాధికార సంస్థ కంపా కార్యవర్గం ఆమోదించింది. మంగళవారం అరణ్యభవన్లో తెలంగాణ కంపా రాష్ట్ర కమిటీ చైర్పర్సన్, పీసీసీఎఫ్ ఆర్ శోభ అధ్యక్షతన 9వ కంపా కార్యవర్గ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణలో కంపా ప్రాజెక్టు కింద 2021-22లో కంపా ప్రాజెక్టు కింద చేపట్టిన పనుల ప్రగతిని చర్చించిన రాష్ట్ర కమిటీ, రూ.600 కోట్ల ప్రతిపాదనలను కేంద్రప్రభుత్వ ఆమోదం కోసం పంపాలని నిర్ణయించింది. తెలంగాణలో 364 చ.కి.మీ అటవీ విస్తీర్ణం పెరిగినట్ట్లు తెలంగాణ కంపా సీసీఎఫ్ లోకేశ్ జైస్వాల్ తెలిపారు. తెలంగాణలోని అటవీ ప్రాంతాల్లో 10.15 మిలియన్ టన్నుల కార్బన్ నిల్వలు పెరిగాయని చెప్పారు. 25న హైదరాబాద్లో కంపా కార్యకలాపాలపై జాతీయ వర్క్షాప్ను నిర్వహించనున్నట్లు జైస్వాల్ తెలిపారు.