హైదరాబాద్ : పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల తరహాలోనే హైదరాబాద్ జిల్లాకు చెందిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలకు క్యాంప్ కార్యాలయాలు నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని రాష్ట్ర శాసనసభా వ్యవహారాలు, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఈ మేరకు క్యాంప్ కార్యాలయాల నిర్మాణంపై హైదరాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు, ఉప సభాపతి, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం నిర్వహించారు.
అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన సమావేశంలో పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, ఉపసభాపతి పద్మారావు గౌడ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, సాయన్న, అహ్మద్ బిన్ బలాల, జాఫర్ హుస్సేన్, కౌసర్ మొయినుద్దీన్, సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, ముంతాజ్ అహ్మద్ ఖాన్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, ఆర్అండ్బీ సెక్రెటరీ శ్రీనివాస్ రాజు, ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి, ఇంజినీర్లు సమావేశంలో పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగ్గా సేవలందించాలనే..
ఎమ్మెల్యేలకు సౌకర్యవంతంగా ఉండడంతో పాటు ప్రజలకు మరింత మెరుగ్గా సేవలు అందాలన్న ఉద్దేశంతో క్యాంపు కార్యాలయాలు నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో దాదాపుగా అన్ని చోట్లా పనులు పూర్తయ్యాయని.. చాలా చోట్ల అందుబాటులోకి వచ్చాయని అన్నారు. క్యాంపు కార్యాలయాలు అందుబాటులోకి రావడంతో ప్రజలకు మంచి జరుగుతోందని.. మెరుగైన సేవలు పొందుతున్నారని చెప్పారు.
అదే తరహాలో రాజధాని హైదరాబాద్ జిల్లాలోని శాసనసభ్యుల కోసం కూడా క్యాంపు కార్యాలయాలు నిర్మించాలని సీఎం ఆదేశించినట్లు ప్రశాంత్ రెడ్డి వివరించారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో క్యాంపు కార్యాలయాల నిర్మాణం కోసం ఆయా నియోజకవర్గాల పరిధిలో 500 చదరపు గజాల చొప్పున భూమిని సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్, సికింద్రాబాద్ ఆర్డీవోలకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు తక్షణమే ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ స్థలాలను పరిశీలించాలని, గౌరవ శాసనసభ్యులతో చర్చించి ప్రభుత్వానికి తగిన నివేదికలు పంపాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.