పెంచికల్ పేట్, సెప్టెంబర్ 6: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం లోడ్పల్లి బీట్ పరిధిలోని సిద్దేశ్వర గుట్ట ప్రాంతంలో పులిదాడి చేయడంతో ఓ దూడ మృత్యువాత పడింది. బెజ్జూర్ మండలం సులుగుపల్లికి చెందిన రైతు లింగయ్యకు చెందిన లేగదూడ పశువులతో కలిసి బుధవారం ఉదయం అడవికి మేతకు వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో పులి దాడి చేసినట్టు పశువుల కాపరి సమాచారం అందించడంతో రైతుతోపాటు అటవీ అధికారులు అక్కడికి వెళ్లారు. పాదముద్రలు పరిశీలించి పులి దాడి చేసినట్టు నిర్ధారించారు. రైతుకు నష్టపరిహారం అందించేందుకు ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దినేశ్ తెలిపారు.