కరీంనగర్ : కేబుల్ వంతెన అప్రోచ్ రోడ్డు పనులను డిసెంబర్ 31లోగా పూర్తి చేసి.. ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. టూరిజం శాఖ ఎండీ, ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ, ఎస్ఆర్ఎస్ సీఈ, నగర మేయర్ జిల్లా కలెక్టర్లతో కలిసి తీగల వంతెన నిర్మాణం, అప్రోచ్ రోడ్డు పనులు, మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. మానేరు రివర్ ఫ్రంట్కు సంబంధించి మ్యాప్లను పరిశీలించారు.
థీమ్ పార్క్లు, ఫౌంటెన్లో ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు. పనులను మరింత వేగవంతంగా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత కరీంనగర్ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేబుల్ బ్రిడ్జి, మానే రివర్ ఫ్రంట్ నిర్మాణాలను చేపట్టామన్నారు.
కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయి, ప్రస్తుతం అప్రోచ్ రోడ్ లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. కరీంనగర్ను ఆనుకొని 24 టీఎంసీల వాటర్బాడీ ఉండడం కరీంనగర్ చేసుకున్న అదృష్టమన్నారు. ఎల్ఎండీపై గుజరాత్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో ఆధునిక థీమ్ పార్క్లతో మానేరు రివర్ ఫ్రంట్ను నిర్మిస్తున్నట్లు చెప్పారు.
పనులు వేగంగా సాగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈఎన్సీ మురళీధర్ మాట్లాడుతూ నెలా నెలా పనుల్లో పురోగతి కనిపిస్తుంద్నారు. వరదను దృష్టిలో పెట్టుకొని పనులను కొనసాగుతున్నామని, మానేరు రివర్ ఫ్రంట్ను ఆకాశమే హద్దుగా తీర్చిదిద్దుతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిండుగా ఉంటుందని పర్యాటకశాఖ ఎండీ మనోహర్ తెలిపారు. ఎల్ఎండీ బ్యూటీఫికేషన్ కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంఆర్ఎఫ్లో భాగంగా ఇప్పటికే ఫౌంటెన్ల కోసం టెండర్లు కూడా పూర్తి చేశామన్నారు.