హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): చైనాయాప్స్ కేసులో కీలక నిందితుడు చార్టెడ్ అకౌంటెంట్ రవికుమార్ను ఎన్ఫోర్స్మెండ్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నవంబర్ 27న అరెస్టు చేశారు. రూ.1100 కోట్ల మేర జరిగిన ఈ కుంభకోణాన్ని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. పెద్దమొత్తంలో డబ్బులు విదేశీబ్యాంక్ ఖాతాలకు మళ్లినట్టు సమాచారం అందడంతో ఈడీ రంగంలోకి దిగింది. నకిలీ ఎయిర్వే బిల్లులు, క్లౌడ్స్టోరేజీ అద్దె చెల్లింపుల పేరిట నకిలీ బిల్లులు సృష్టించి పెద్దమొత్తంలో డబ్బును రవికుమార్ హాంకాంగ్, చైనాలోని పలు బ్యాంక్ఖాతాలకు మళ్లించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. లింక్యున్ టెక్నాలజీ, డోకిపే టెక్నాలజీ పేరిట ఆన్లైన్ గేమింగ్ యాప్స్ను సృష్టించి వాటి ద్వారా రూ.కోట్లు కొల్లగొట్టినట్టు గుర్తించారు. ఆ మొత్తాన్ని క్రిప్టోకరెన్సీగా మార్చి విదేశీ బ్యాంకులకు తరలించారు. కేశాల కొనుగోలు వ్యాపారం తదితర అంశాలను ఇప్పటికే గుర్తించిన అధికారులు తాజాగా ఫేక్ ఎయిర్వే బిల్లుల రూపంలోనూ డబ్బును మళ్లించినట్టు తెలుసుకున్నారు. రవికుమార్ను హైదరాబాద్ ఈడీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా, ఈనెల 9 వరకు కస్టడీకి కోర్టు అనుమతించింది.