హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): బీజేపీ తన స్వార్థ రాజకీయం కోసం తెచ్చిపెట్టిన మునుగోడు ఉప ఎన్నికకు రణభేరి మోగింది. జాతీయ రాజకీయాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దృష్టి సారించకుండా.. రాష్ర్టానికే పరిమితం చేయాలన్న కుట్ర నేపథ్యంలో వచ్చిన ఉప ఎన్నికకు సోమవారం షెడ్యూల్ విడుదల అయింది. నవంబర్ 3న ఎన్నిక జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. సాధారణంగా ఒక ఎమ్మెల్యే రాజీనామా కారణంగా ఖాళీ అయిన స్థానానికి తిరిగి ఎన్నిక జరపడానికి ఆరుమాసాల గడువు ఉన్నప్పటికీ.. మునుగోడులో రాజగోపాల్రెడ్డిచేత రాజీనామా చేయించి రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే షెడ్యూల్ విడుదల చేయించినట్టు తెలుస్తున్నది. ఈ నెల పదిహేను లోగా మునుగోడు షెడ్యూల్ విడుదల కావొచ్చని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ప్రకటించి 24 గంటలు గడువకుండానే షెడ్యూల్ విడుదల అయిందంటేనే.. ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ ఏ విధంగా ప్రభావితం చేస్తున్నదో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మునుగోడుతోపాటు దేశవ్యాప్తంగా ఆరు రాష్ర్టాల్లో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. మునుగోడు ఉప ఎన్నికకు ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఆరోజు నుంచి 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 3 న పోలింగ్ జరుగుతుంది. మునుగోడుతోపాటు బీహార్లోని మొకామా, గోపాల్గంజ్, మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్, హర్యానాలోని ఆదంపుర్, గోలా గోకర్ణ్ నాథ్, ఒడిశాలోని ధామ్నగర్ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి.