హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఉద్యోగాల జాతర నడుస్తున్నది. నిరుడు మార్చి 9న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేసినప్పటి నుంచి రాష్ట్రంలో కోలాహలం పెరిగింది. దీంతో 2022 నోటిఫికేషన్ల సంవత్సరంగా.. 2023 పరీక్షల సంవత్సరంగా మారింది. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్, గ్రూప్-4తోపాటు మరికొన్ని పరీక్షలు పూర్తయ్యాయి. ఆగస్టు 29,30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగనున్నది. గ్రూప్-3 పరీక్ష తేదీల ఖరారుతోపాటు గ్రూప్-1 మెయిన్స్, కళాశాల లెక్చరర్లు, సంక్షేమ వసతిగృహాల అధికారులు (హెచ్డబ్ల్యూవో), డివిజినల్ అకౌంట్స్ అధికారుల (డీఏవో) పరీక్షల నిర్వహణకు టీఎస్పీఎస్సీ ముమ్మర కసరత్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కమిషన్ను ఆశ్రయిస్తున్నారు.
పోటీ పరీక్షలకు సీరియస్గా సన్నద్ధమయ్యేవారు మాత్రం పరీక్షలను వాయిదా వేయొద్దని కోరుతున్నారు. అక్టోబర్లో దసరా సెలవులు ఉండటం, ఆ తర్వాత నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని అభ్యర్థిస్తున్నారు. దీంతో టీఎస్పీఎస్సీ సైతం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నది. ఇప్పటికే గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు తేదీలు అందుబాటులో లేవు. సంక్షేమ వసతిగృహాల అధికారులు, డీఏవో పరీక్షలదీ ఇదే పరిస్థితి. మరోవైపు గ్రూప్-1 మెయిన్స్ తేదీల ఖరారు టీఎస్పీఎస్సీకి పెద్ద పరీక్షగా మారింది. ఇటువంటి తరుణంలో మరో ప్రధాన పరీక్షను వాయిదా వేయడం సాధ్యంకాదని ఇటీవల జరిగిన సమావేశంలో కమిషన్ అభిప్రాయపడింది. ఒకసారి పరీక్షను వాయిదావేస్తే మళ్లీ ఈ ఏడాది నిర్వహించడం కష్టమేనని, కనుక ఆగస్టు 29, 30 తేదీల్లోనే గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని కమిషన్ ఏకాభిప్రాయానికి వచ్చింది.
టీఎస్పీఎస్సీ సాధారణంగా సెలవు రోజు ల్లో (శని, ఆదివారాల్లో) ఎక్కువ పరీక్షలను నిర్వహిస్తుంది. కానీ, ఈ ఏడాది డిసెంబర్ వరకు శని, ఆదివారాల్లో పరీక్షల షెడ్యూల్ బిజీగా ఉన్నది. ఆగస్టులో సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్, ఐబీపీఎస్ క్లర్ ఉద్యోగాలకు.. సెప్టెంబర్లో ఐబీపీఎస్ క్లర్స్, ఎన్డీఏ, సీడీఎస్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ, సివిల్స్ మెయిన్స్, ఐబీపీఎస్ ప్రొబేషనరీ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబర్, నవంబర్లో ఐబీపీఎస్, యూపీఎస్సీ, ఐఎఫ్ఎస్ మెయి న్స్ పరీక్షలను.. డిసెంబర్లో మిలిటరీ కళాశాల ప్రవేశ పరీక్షతోపాటు యూపీఎస్సీ, ఐబీపీఎస్ స్పెషలిస్టు పోస్టులకు పరీక్షలు జరగనుండటంతో ఈలోపే టీఎస్పీఎస్సీ గ్రూప్-3, గ్రూప్-1 మెయిన్స్ లాంటి కీలక పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ఏదైనా పరీక్షను వాయిదా వేస్తే దాన్ని మళ్లీ ఈ ఏడాది తిరిగి నిర్వహించడం కష్టమే. దీంతో ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ ప్రకటించిన పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని, ముఖ్యంగా గ్రూప్-2 పరీక్ష తేదీలో ఎటువంటి మార్పు ఉండబోదని కమిషన్ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.