జూలూరుపాడు, నవంబర్ 19: ఓ గ్రామానికి పుష్కరం తరువాత బస్సు రావడంతో స్థానికులు సంబురాలు జరుపుకొన్నారు. భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి 12 సంవత్సరాలుగా బస్సు సౌకర్యం లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని కోరు తూ స్థానిక యువకుడు చెవుల బాలరాజు ఇటీవల ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ట్విట్టర్ ద్వారా విన్నవించాడు. వెంటనే స్పందించిన ఆయన డిపో మేనేజర్ ను ఆదేశించడంతో శుక్రవారం గ్రామానికి బస్సు వచ్చింది. ఈ సందర్భంగా స్థానికులు బస్సుకు మా మిడి ఆకులు, కొబ్బరి మట్టలు కట్టారు. మిఠాయిలు పంపిణీ చేసి సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, కొత్తగూడెం డీఎం వెంకటేశ్వరబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఓ యువకుడు చేసిన ట్విట్టర్ పోస్టుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించి సర్వీసును పునరుద్ధరించారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం నామాపురానికి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డిపో నుంచి వచ్చే ఆర్టీసీ బస్సు లాక్డౌన్ కారణంగా నిలిచిపోయింది. రెండేండ్ల నుంచి బస్సు రాకపోవడంతో స్థానికులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం గ్రామానికి చెందిన యువకుడు బాలం వెంకటేశ్.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ట్వీట్ చేశాడు. స్పందించిన సజ్జనార్ అధికారులను ఆదేశించడంతో వారు బస్సు సర్వీసును శుక్రవారం నుంచి పునరుద్ధరించారు.