హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): హాస్టల్ విద్యార్థులకు ఏ లోటు రానీయకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం తెలిపారు. బీసీ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో కేవలం 78 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, 235 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు మాత్రమే అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. వీటి మరమ్మతుల బాధ్యత ఆయా భవనాల యాజమాన్యాలదేనని వెల్లడించారు. భవనాల అద్దెకు, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.13.10 కోట్లను విడుదల చేసిందన్నారు. విద్యార్థుల కాస్మొటిక్ చార్జీల పెంపు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని తెలిపారు. డైట్ చార్జీలు రాష్ట్రమంతా ఒకేవిధంగా ఉంటాయని, జిల్లాకో మాదిరిగా ఉండే అవకాశమే లేదని వెంకటేశం స్పష్టంచేశారు.