హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ఇంధన పొదుపులో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) విశేషకృషి చేస్తున్నది. బీఈఈ 22వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే మాట్లాడుతూ.. ఇంధన సామర్థ్యం రంగంలో సాధించిన విజయాలను వెల్లడించారు.
బీఈఈ చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు ద్వారా 2022-23 సంవత్సరంలో 50.98 మిలియన్ టన్నుల చమురు (ఎంటీవోఈ)తో సమానమైన ఇంధనాన్ని ఆదా చేసినట్టు వివరించారు. 24.68 ఎంటీవోఈ థర్మల్ విద్యుత్తును కూడా పొదుపు చేశామని తెలిపారు. మొత్తం గా 306,55 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించినట్టు చెప్పారు. కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్కే సింగ్ తదితరులు బీఈఈని అభినందించారు.