విదేశీ మారక చట్టం ఉల్లంఘనకు సంబంధించిన కేసులో హైదరాబాద్తో సహా దేశంలోని పలు నగరాల్లో జరిపిన సోదాల్లో రూ.2.54 కోట్ల లెక్కలు చూపని నగదును స్వాధీనం చేసుకొన్నట్టు ఈడీ మంగళవారం వెల్లడించింది. ఇందులోని కొంత మొత్తాన్ని వాషింగ్ మెషీన్లో దాచి ఉంచగా.. దాన్ని సీజ్ చేశామని పేర్కొన్నది. రూ.1,800 కోట్ల మేర అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించి అందిన సమాచారంపై కాప్రికార్నియన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, డైరెక్టర్లు విజయ్ కుమార్, సంజయ్ గోస్వామి నివాసాలతోపాటుగా కంపెనీ అనుబంధ సంస్థల ప్రాంగణాల్లో సోదాలు చేపట్టినట్టు ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది.
అయితే ఎప్పుడు ఈ సోదాలు చేశారు? ఆ నగదు ఎక్కడ పట్టుబడిందనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు, ఎన్నికల వేళ రాష్ట్రంలో భారీగా నగదు, మద్యం పట్టుబడుతున్నది. 375 చెక్పోస్టులు.. ఆయా జిల్లాలు, మండలాల సరిహద్దుల్లో తనిఖీల ద్వారా మంగళవారం రాత్రి వరకు రూ.38,12,34,123 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఉచితాలు, బంగారు, వెండి ఆభరణాలు, ఇతర సామగ్రి పట్టుబడింది.