నర్సాపూర్, నవంబర్16: మెదక్ జిల్లా నర్సాపూర్లో గురువారం నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో బుల్లెట్ల కలకలం రేగింది. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో అస్లాం అనే వ్యక్తి ప్రెస్ గ్యాలరీ కూర్చున్నాడు. అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేశారు. రెండు బుల్లెట్లు దొరకడంతో స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ప్రస్తుతం చిలప్చెడ్ మండలం చండ్రులో ఉంటున్నట్టు తెలిసింది. అతను ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. డిగ్రీ క్లాస్మేట్ సహాయంతో ఓ యూట్యూబ్ చానల్ ఐడీ కార్డు సంపాదించినట్టు తేలింది. అస్లాం గతంలో ఎన్సీసీలో పనిచేసినట్టు సమాచారం. అక్కడ పనిచేసినప్పుడే తీసుకొచ్చిన బుల్లెట్లు అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా అస్లాం కర్ణాటకకు చెందిన వ్యక్తిగా కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.