వరంగల్, జూన్ 13 : పేదల కాలనీపై కొంతకాలంగా సర్కార్ కక్షగట్టింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని భద్రకాళి దేవాలయం పక్కన ఉన్న చరబండరాజు కాలనీ వాసుల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేశారు. హైకోర్టు స్టేటస్కో ఉత్తర్వులు, మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఉత్తర్వులు ఉన్నా అధికార పార్టీ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అనుచరులు చరబండరాజు కాలనీలో హంగామా సృష్టించారు. పేదలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించారు. కూల్చివేతలను అడ్డుకున్న మహిళలపై దౌర్జన్యం చేశారు.
మహిళలని చూడకుండా పిడిగుద్దులు కురిపించారు. సెలవు రోజులు చూసుకొని కాలనీపై బుల్డోజర్లను దింపారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇండ్ల కూల్చివేతల మోతలు కాలనీ అంతా ధ్వనించాయి. పోలీసు పహారా మధ్య ఎమ్మెల్యే అనుచరులు కాలనీలో నానా యాగీ చేశారు. కండ్లముందే కట్టుకున్న చిన్నపాటి ఇండ్లు నేలమట్టమవుతుంటే చూడలేక మహిళలు లబోదిబోమంటూ విలపించారు. భద్రకాళి ఆలయం చుట్టూ మాడవీధుల నిర్మాణంలో భాగంగా పక్కన ఉన్న చరబండరాజు కాలనీ వాసులను ఖాళీ చేయాలని ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొస్తున్నారు.

కాలనీవాసుల మధ్య గొడవ.. చెప్పు చూపిస్తున్న మహిళ
కాలనీలో నివాసం ఉండకుండా బయట ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కాలనీ పట్టాదారులను అధికార పార్టీ నేతలు లొంగదీసుకొని స్వచ్ఛందంగా ఖాళీ చేస్తున్నామనే నాటకానికి తెరలేపారు. వారంతా తాము స్వచ్ఛందంగా కూల్చివేతలు చేపడుతున్నామని చెప్తూ.. ఎమ్మెల్యే మాట వినని వారి ఇండ్లను సైతం కూల్చివేశారు. రెండు దశాబ్దాలుగా నివాసముంటున్న కాలనీ వాసులు మాత్రం తమ ఇండ్లను బలవంతంగా కూల్చివేస్తున్నారని వాపోతున్నారు. కాగా ఎమ్మెల్యే అనుచరగణం దౌర్జన్యం చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. యువకులు, మహిళలపై దాడి చేస్తున్నా మిన్నకుండిపోయారు. ఆరు గంటలపాటు అక్కడ అధికార పార్టీకి చెందిన యువకుల దాష్టీకాన్ని పోలీసులు అడ్డుకోలేకపోయారు.
చరబండరాజు కాలనీవాసులపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కుట్రలు పన్నుతున్నారని కాలనీ పేదలు ఆరోపిస్తున్నారు. 2003లో అప్పటి ప్రభుత్వం 757 సర్వే నంబర్లో బండకొట్టే 155 మంది కార్మికులకు పట్టాలు ఇచ్చారని. ప్రస్తుతం అందులో 40 కుటుంబాలు అప్పటినుంచి అక్కడ గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నట్టు తెలిపారు. కాలనీలో కాకుండా బయట ఇండ్లు కట్టుకొని ఉంటున్న పట్టాదారులను ఏకం చేసి కూల్చివేతకు వారిని ఎమ్మెల్యే ఒప్పించారని ఆరోపించారు. 20 ఏండ్లుగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్న అసలైన వారిని పట్టించుకోకుండా ఇక్కడ నివాసం ఉండని వారితో కలిసి కాలనీ ఖాళీ చేయించే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారనే అపవాదును అంటగట్టి తమను ఖాళీ చేయించేందుకు ఎమ్మెల్యే నాయిని ఆరు నెలలుగా కుట్ర చేస్తున్నారని పేదలు ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యే అనుచరుడు నా ఇంటిని దౌర్జన్యంగా కూల్చివేయించాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోలేదు. ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పలేదు. అయినా బుల్డోజర్ తీసుకొచ్చి ఇంటిని కూల్చి వేసి రోడ్డున పడేశాడు. 20 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నా. ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి? ఇల్లు ఖాళీ చేస్తున్నవారు ఇక్కడ ఉండరు. అంతా బయట ప్రాంతాల్లో ఇండ్లు కట్టుకొని ఉంటున్నారు. వారు ఇక్కడికి వచ్చి మాపై దౌర్జన్యం చేసి ఇండ్లను కూల్చివేస్తున్నారు. బీఆర్ఎస్ కాలంలో మా జోలికి ఎవ్వరూ రాలేదు. కరెంట్, నల్లా నీళ్లు ఇచ్చారు. నాయిని రాజేందర్రెడ్డి గెలిచాక మా వెంట పడ్డాడు. నాకు న్యాయం జరుగకపోతే విషం తాగి
సచ్చిపోతా. దానికి ఎమ్మెల్యేనే బాధ్యత వహించాలి.
– జన్ను సునీత, చరబండరాజుకాలనీ