హైదరాబాద్, మే 23 : త్వరలోనే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు, రోడ్లు, డ్రైనేజీల వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఇందుకు సీఎం కేసీఆర్ సరిపడా నిధులు ఇచ్చారని మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఇంద్రకర్రెడ్డి, మల్లారెడ్డి అన్నారు. సీఎం ఆదేశానుసారం త్వరలోనే ఎస్టీ శాసన సభ్యులతో సమావేశమై ఈ అంశంపై విస్తృతంగా చర్చిస్తామన్నారు.
అలాగే నిధుల విడుదల వంటి పలు అంశాలపై చర్చించడానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుతో భేటీ కావడంతో పాటు ఎస్టీ గ్రామాల రోడ్లు, డ్రైనేజీ, కొత్త గ్రామ పంచాయతీ భవనాలు వంటి మౌలిక వసతులపై మంత్రి ఎర్రబెల్లి అధ్యక్షతన, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ఆయా శాఖల ఉన్నాతాధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు మీడియాకు వివరించారు.
కొత్త గ్రామ పంచాయతీల భవనాలు, మౌలిక సదుపాయాల కోసం సీఎం కేసీఆర్ బడ్జెట్లో వెయ్యి కోట్లు పెట్టారు.
ఆదిమ తెగల గూడాల్లో రోడ్ల కోసం పంచాయతీరాజ్ శాఖ రూ.70 కోట్లు, గిరిజన సంక్షేమశాఖ రూ.70 కోట్లు మొత్తం 140 కోట్లు రెడీగా ఉన్నాయి. ఇవేగాక రాష్ట్రంలోని 2400 కొత్త గ్రామ పంచాయతీల్లో భవనాల నిర్మాణం కోసం రూ.300 కోట్లు, పంచాయతీరాజ్, రూ.300 కోట్లు గిరిజన సంక్షేమ నిధులు ఇవన్నీ కలిపి త్వరలోనే గిరిజన, ఆదివాసీ గూడాల్లో తండాల్లో గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపడతామని మంత్రులు వివరించారు.
అయితే, ఈ నిధులు వినియోగంపై ఎస్టీ శాసన సభ్యులతో ఒక సమావేశం నిర్వహిస్తామన్నారు. అలాగే ఆర్థిక మంత్రి హరీశ్ రావుతో ఒక భేటీ ఉంటుందని మంత్రులు తెలిపారు. ఈ లోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్లు మంత్రులు వివరించారు. కార్యక్రమంలో ఈజీఎస్ స్టేట్ డైరెక్టర్లు అందె యాకయ్య, సద్గుణ, వెంకటనారాయణ గౌడ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిష్టినా జడ్ చోంగ్తు, కమిషనర్ శరత్, ఈజీఎస్ స్పెషల్ కమిషనర్ ప్రసాద్, ఈఎన్సీ సంజీవరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.