హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): అందరిలోనూ ఒకింత ఉత్కంఠ రేకెత్తించిన 2023-24 వార్షిక బడ్జెట్కు మార్గం సుగమమయ్యింది. అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 3న బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నాయి. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. మండలి, అసెంబ్లీ సంయుక్త సమావేశానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. బడ్జెట్ సమర్పణ పత్రాలపై సంతకం చేశారు. రాష్ట్ర హైకోర్టు సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం, రాజ్భవన్ న్యాయవాదుల మధ్య సోమవారం రాజీ కుదిరింది. హైకోర్టులో అత్యవసరంగా దాఖలు చేసిన పిటిషన్ విషయంలో ప్రభుత్వం, రాజ్భవన్ న్యాయవాదుల మధ్య అడ్వొకేట్ జనరల్ చాంబర్లో జరిగిన చర్చలు ఫలించాయి.
తమకు ఎలాంటి దురుద్దేశాలు లేవని రాజ్భవన్ న్యాయవాది పేర్కొనగా, సంయుక్త సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. దీంతో ఇరుపక్షాల మధ్య అపోహలు తొలగిపోయాయి. బడ్జెట్ సమావేశాలపై స్పష్టత వచ్చింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాలతో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు సోమవారం సాయంత్రం రాజ్భవన్కు వెళ్లారు. గవర్నర్ తమిళిసైతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మనోగతాన్ని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు.
చాలా సంతోషమని, తాను కూడా పూర్వపు వాతావరణాన్నే కోరుకుంటున్నానని, ఇప్పటి వరకు జరిగింది ఏదీ వ్యక్తిగతం కాదని గవర్నర్ స్పష్టం చేశారు. దీనితో ఇటు ప్రభుత్వం, అటు రాజ్భవన్ మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్నట్టయ్యింది. మంత్రి, అధికారుల బృందం గవర్నర్తో భేటీ తరువాత బడ్జెట్ సమావేశాలకు మార్గం సుగమమైంది. ఫిబ్రవరి 3న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఆ రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ తరువాత రెండు, మూడు రోజుల్లో బడ్జెట్ను ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారు. ఇందుకు సంబంధించిన బడ్జెట్ సమర్పణ పత్రాలపై గవర్నర్ సంతకం చేశారు. అలాగే శాసనససభ, మండలి సంయుక్త సమావేశానికి గవర్నర్ అనుమతించారు.
హైకోర్టులో బడ్జెట్ రాజీ
ఇదిలా ఉండగా.. రాష్ట్ర శాసనసభల్లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంపై దాఖలైన వివాదం హైకోర్టు వేదికగా పరిషారమైంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ అనుమతి ఇస్తారని రాజ్భవన్ తరఫు న్యాయవాది హైకోర్టుకు హామీ ఇచ్చారు. దీంతో పిటిషన్పై విచారణ ముగించాలని ప్రభుత్వం చేసిన అభ్యర్థనను హైకోర్టు ఆమోదించింది. న్యాయస్థానాలు గవర్నర్కు నోటీసులు జారీ చేయలేవని, అయినా, రెండు రాజ్యాంగ వ్యవస్థలు చర్చల ద్వారా వివాదానికి ముగింపు చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి చేసిన సూచనలు ఫలించాయి. దీంతో ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు అడ్వొకేట్ జనరల్ జే రామచందర్రావు, గవర్నర్ తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అశోక్ ఆనంద్కుమార్ భోజన విరామంలో చర్చించారు.
ఇరుపక్షాల న్యాయవాదులు అడ్వొకేట్ జనరల్ చాంబర్లో చేసిన సంధి సంప్రదింపులు ఫలించాయి. ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య కుదిరినట్టు ఒప్పం దం ప్రకారం ఫిబ్రవరి 3న సమావేశాలు నిర్వహిస్తామని గవర్నర్ను ఆర్థిక మంత్రి ఆహ్వానించాలి. మంత్రి ఆహ్వానం అందుకున్న తర్వాత గవర్నర్ ఆమోదం చెప్పాలి. మంత్రివర్గం రూపొందించిన ప్రసంగాన్ని గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించాలి. పెండింగ్లో ఉన్న బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపాలి. గవర్నర్ నుంచి అభ్యంతరాలు వస్తే వాటికి సంబంధిత శాఖల మంత్రులు, కార్యదర్శులు వివరణ ఇవ్వాలని ఒప్పందం కుదిరినట్లు ప్రభుత్వ న్యాయవాది వివరించారు. ఇదే విషయాన్ని భోజన విరామం తర్వాత జరిగిన విచారణలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ టీ తుకారాంజీతో కూడిన ధర్మాసనానికి ఇరుపక్షాల న్యాయవాదులు నివేదించారు. దీంతో పిటిషన్పై విచారణను ముగిస్తున్నట్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.