హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఎమ్మెల్యేలు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేశారు. శనివారం అసెంబ్లీలో 2014 తెలంగాణ బడ్జెట్ను మంత్రి భట్టీ విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్పై ఎమ్మెల్యేలు మాట్లాడారు.
బడ్జెట్ నిరాశ పరిచింది : ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
బడ్జెట్ ఒక రాజకీయ ప్రసంగం (Political Speech) లా ఉందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను నిరాశ పరిచిందని, కేవలం అంకెల గారడీల మాదిరి ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిందా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Houses) నియోజక వర్గానికి 3,500 ఇండ్లకు 20 వేల కోట్లు కావాలి. బడ్జెట్లో పెట్టింది రూ. 7 వేల కోట్లు మాత్రమేనని విమర్శించారు. 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు భృతి ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు బారెడు. బడ్జెట్ మాత్రం మూరెడుగా ఉందని విమర్శించారు.
ఇచ్చిన హామీలు అమలు చేయడానికి మీ వెంట పడుతాం : పాయల్ శంకర్
దేశానికి వెన్నముక అయిన రైతుకు బడ్జెట్లో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బడ్జెట్లో రెండు లక్షల రూపాయల రైతుల రుణ మాఫీ(Loan waiver) ప్రస్తావన లేదని ఆరోపించారు. బీసీలకు తగినంత కెటాయించలేదని, గొల్ల, కుర్మలకు నిధుల విడుదల్లో స్పష్టత లేదని అన్నారు.
వాస్తవికతకు దగ్గరగా బడ్జెట్ : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కాంగ్రెస్ వాస్తవికతకు దగ్గరగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలకు కూడా బడ్జెట్ కేటాయించిందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. వాస్తవంగా సాగు చేస్తున్న భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలని అన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాట్లు మంచి పరిణామమని పేర్కొ్న్నారు. ఆరోగ్యశ్రీ పథకం పరిమితి రూ.10 లక్షలకు పెంచడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బడ్జెట్పై ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ పారదర్శకతకు నిదర్శనమని అన్నారు. వాస్తవాలను చెప్పి ప్రజా పరిపాలన చేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పర్గి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు అధిక నిధులు కేటాయించిందని అన్నారు. బడ్జెట్లో గ్రామ పంచాయతీలకు, అర్బన్ డెవలప్మెంట్కు మూసీ రివర్ ప్రాజెక్ట్, విద్య, వైద్య రంగానికి ప్రాధాన్యతను ఇచ్చిందన్నారు.