నందికొండ, మే 14: ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నందికొండలో బుద్ధవనాన్ని అంతర్జాతీయస్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించి ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తున్నారని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. శనివారం నల్లగొండ జిల్లా నందికొండ హిల్కాలనీలో నిర్మించిన బుద్ధవనాన్ని మంత్రులతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుద్ధవనానికి 274 ఎకరాలు కేటాయించగా, 90 ఎకరాల్లో ప్రపంచదేశాలు ఆకర్షించేలా నిర్మించామని పేర్కొన్నారు. మరింత అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరుచేస్తామని, విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషిచేస్తామని హామీఇచ్చారు. బౌద్ధదేశాల రాయబారులను, బౌద్ధ భిక్షువులను పిలిపించి బుద్ధవనం అభివృద్ధికి కృషిచేస్తామని తెలిపారు.
బుద్ధవనాన్ని బౌద్ధసర్క్యూట్గా మార్చడంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. పర్యాటకం కోసం చాకలిగట్టును అభివృద్ధి చేస్తామని, బుద్ధవనంలో సైక్లింగ్ట్రాక్ ఏర్పాటు చేస్తామని.. ప్రైవేటు సంస్థలకు, ఇతరదేశాలకు ప్రోత్సాహకం కల్పిస్తూ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి దలైలామాను బుద్ధవనానికి రప్పించి అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్తామని వెల్లడించారు. బుద్ధవనం నిర్మాణానికి అహర్నిశలు శ్రమించిన ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, పురావస్తుశాఖ నిపుణుడు ఈమని శివనాగిరెడ్డి, అధికారులు, శిల్పులకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. అంతకుముందు బుద్ధవనంలో బుద్ధుడి పాదాలకు పుష్పాంజలి ఘటించి, మహాస్థూప ధ్యాన కేంద్రంలో బౌద్ధ భిక్షువులతో కలిసి ప్రార్థనలు చేశారు.
దేశ నలుమూలల నుంచి బౌద్ధ నమూనాలను పరిశీలించి ఏడేండ్లలోనే బుద్ధవనం నిర్మాణం పూర్తయ్యిందని, బుద్ధవనం ప్రాజెక్ట్ రాష్ర్టానికి తలమానికమని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, చామకూర మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, టీఎస్టీడీసీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ కర్ణ అనూషారెడ్డి, బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, పురావస్తు నిపుణుడు ఈమని శివనాగిరెడ్డి, నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ తదితరులు పాల్గొన్నారు.