నందికొండ, మే 16: నల్లగొండ జిల్లా నందికొండలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బుద్ధవనంలో గౌత మ బుద్ధుడి 2,566వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో బౌద్ధ గురువులు, బౌద్ధ భిక్షువులు బౌద్ధ సంప్రదాయంలో వాయిద్యాలతో బుద్ధ చరిత వనంలోని బుద్ధుడి పాదాలకు పుష్పాంజలి ఘటించి, బుద్ధ వందనాలు చేశారు. మహాస్థూపం అంతర్భాగంలోని సమావేశ మందిరంలో మైసూర్ నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులతో మహాబోధి ఆనంద బుద్ధ విహార సొసైటీ భిక్షువులు చాంటింగ్ (ప్రార్థనలు) నిర్వహించారు.
ఈ సందర్భంగా మహాబోధి ఆనంద బుద్ధ విహార సొసైటీ తెలంగాణ నిర్వాహకుడు సంగపాల్ బంతే మాట్లాడుతూ.. బుద్ధుడు జన్మించిన నేపాల్లోని లుంబినీ, బుద్ధుడికి జ్ఞానోదయం అయిన బీహార్లోని బుద్ధగయ, ధర్మచక్ర పరివర్తన అనంతరం మొదటి ఉపన్యాసం ఇచ్చిన ఉత్తరప్రదేశ్లోని సారనాథ్, బుద్ధుడు నిర్యాణం పొం దిన కృషినగర్ వలే బుద్ధవనం ప్రాజెక్ట్ భవిష్యత్తులో ఈ నాలుగింటిని సమ్మేళనం చేస్తూ ప్రఖ్యాతి పొందుతుందని చెప్పారు. మైసూర్కు చెందిన బౌద్ధ గురువు గేసే నగ్గ్ వాంగ్ మాట్లాడుతూ.. బుద్ధవనం ప్రాజెక్ట్ ఎంతో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నదని, బౌద్ధ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో హర్యానా ప్రభుత్వ అడిషనల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్, ప్రముఖ జర్నలిస్టు రామచంద్రమూర్తి, బుద్ధవనం ఓఎస్డీ సుధాన్రెడ్డి, ఎస్ క్రాం తిబాబు, పురావస్తు నిపుణుడు ఈమని శివనాగిరెడ్డి, బుద్ధవనం సహాయక శిల్పి శ్యామ్సుందర్ పాల్గొన్నారు.