హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): గుంటూరులో గత ఏడాది ఆగస్టు 15న జరిగిన బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్య (20) హత్య కేసులో ఫాస్ట్ట్రాక్ కోర్టు శుక్రవారం నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. తనను ప్రేమించడం లేదంటూ రమ్యను శశికృష్ణ దారుణంగా కత్తితోపొడిచి చంపాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు 10 గంటల వ్యవధిలోనే అతడిని ఆరెస్టు చేశారు. 2 రోజుల్లో ఫోరెన్సిక్, డీఎన్ఏ పరీక్షల అనంతరం నిందితుడుగా శశికృష్ణను నిర్ధారించారు.
ఘటన జరిగిన వారంరోజుల్లో దిశ చట్టం ప్రకారం పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. ఘటన జరిగిన 9 నెలల పాటు క్రమం తప్పకుండా కోర్టులో విచారణ జరిగింది. 257 రోజుల్లోనే కేసు విచారణ పూర్తయింది. సుదీర్ఘ వాదనల తర్వాత శశికృష్ణకు కోర్టు ఉరిశిక్ష విధించింది. 28 మంది సాక్షుల నుంచి పోలీసులు వాంగ్మూలం సేకరించారు. నేర నిర్ధారణలో సీసీ ఫుటేజీ కీలకంగా మారిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ప్రత్యక్ష సాక్షులతో పాటు డిజిటల్ ఆధారాలు కీలకంగా మారాయని ఎస్పీ తెలిపారు. కోర్టు తీర్పుపై రమ్య కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఉరిశిక్ష అమలైన రోజుమరింత సంతోషిస్తామని రమ్య తల్లి అన్నారు. రమ్య సోదరి మౌనిక మాట్లాడుతూ.. కేసు విచారణలో ఎక్కడా ఏ చిన్న అలక్ష్యం జరగలేదని అన్నారు.