హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. బీటెక్కు గరిష్ఠ ఫీజును రూ.1.60 లక్షలుగా, కనిష్ఠ ఫీజును రూ.45 వేలుగా నిర్ణయించింది. తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) సిఫారసుల మేరకు 159 ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో -37ను బుధవారం జారీచేశారు. ఈ పెంపు మూడేండ్లు అమల్లో ఉంటుంది. ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ కోర్సులకు కూడా ఫీజులను ప్రభుత్వం సవరించింది.
బీటెక్ కోర్సుకు కనిష్ఠ ఫీజును రూ.35 వేల నుంచి రూ.45 వేలకు పెంచారు. 40 కాలేజీల్లో ఫీజు రూ.1 లక్ష దాటింది. గతంలో రూ.1 లక్షకు పైగా ఫీజు 18 కాలేజీల్లో ఉండేది. రూ.75 వేల నుంచి రూ. 99 వేల వరకు ఫీజు ఉన్న కాలేజీలు గతంలో 24 ఉండగా, తాజాగా 38 కి చేరాయి. 72 కాలేజీల్లో ఫీజులు రూ.45,001 నుంచి రూ. 75వేల లోపు ఉన్నాయి. 9 కాలేజీల్లో రూ.45 వేలుగా ఉన్నది. అత్యధికంగా ఎంజీఐటీలో ఫీజు రూ.1.60 లక్షలు ఉన్నది. సీవీఆర్ కాలేజీలో రూ.1.50 లక్షలు, సీబీఐటీ, వర్ధమాన్, వాసవి కాలేజీల్లో రూ.1.40 లక్షలుగా నిర్ణయించారు. 2019లో ఇంజినీరింగ్ ఫీజులను సవరించగా, తాజాగా 2022-23, 2023-24, 2024 -25 విద్యా సంవత్సరాలకు ఫీజులు ఖరారుచేశారు. అయితే రాష్ట్రంలో 173 కాలేజీలుండగా, తాజాగా 159 కాలేజీలకే ప్రభుత్వం జీవోను జారీచేసింది. పలు కాలేజీల అఫిలియేషన్లు ఇతరాత్ర అనుమతులు పెండింగ్లో ఉండటంతో వాటిలో ఫీజును నిర్ణయించలేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి ఇప్పటికే రెండు విడుతల కౌన్సిలింగ్ పూర్తిచేశారు. ఎల్లుండి నుంచి మూడో విడుత కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే సీట్లు పొందిన విద్యార్థులంతా కన్వీనర్కు పాత ఫీజులనే చెల్లించారు. తాజాగా ఫీజులు పెరగడంతో ఇప్పటికే ఫీజు చెల్లించిన మొత్తాన్ని మినహాయించి మిగతా మొత్తాన్ని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అదనపు ఫీజులు కాలేజీల్లోనే చెల్లించాలి. ఆయా సమాచారాన్ని ఎంసెట్ వెబ్సైట్లో పొందుపరుస్తామని అధికారులు తెలిపారు.
ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ కోర్సుల ఫీజులను సైతం ప్రభుత్వం సవరించింది. 238 ఎంబీఏ, 26 ఎంసీఏ, 76 ఎంటెక్ కాలేజీల్లో ఫీజుల ఖరారుచేసింది. ఎంబీఏ కనిష్ఠ ఫీజు రూ.27వేలు ఉండగా, గరిష్ఠ ఫీజు రూ.1.10 లక్షలుగా నిర్ణయించారు. ఎంసీఏలో కనిష్ఠ ఫీజు రూ.27 వేలు, గరిష్టంగా రూ.95 వేలు ఉన్నది. ఎంటెక్ ఫీజు కనిష్ఠం రూ. 57 వేలు, గరిష్ఠం రూ.1.10 లక్షలుగా నిర్ణయించారు. ఈ ఫీజులు 2022 -25 బ్లాక్ పీరియడ్కు వర్తిస్తాయని వేర్వేరు జీవోల్లో తెలిపింది.
సవరణతో ఇంజినీరింగ్ ఫీజులు కొంతమేర పెరిగినా.. విద్యార్థులపై భారం అంతగా ఉండదని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వర్తింపజేస్తుండటంతో ఆయా వర్గాల వారికి ఉపశమనం కలుగుతుందని అంటున్నారు. మన దగ్గర ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ చదువుకొన్న విద్యార్థులకు పూర్తి ఫీజును ప్రభుత్వమే భరిస్తున్నది. ఎంసెట్లో 10 వేల లోపు ర్యాంకు వచ్చినవారు ఏ కాలేజీలో చేరినా వారి ఫీజులను సైతం ప్రభుత్వమే చెల్లిస్తున్నది. తాజా ఫీజుల సవరణలో ఈ కోటాల కిందికి రాని విద్యార్థులకు సైతం ప్రస్తుతం రూ.35 వేలను రీయింబర్స్మెంట్గా అందజేస్తున్నది.