మంచాల/అచ్చంపేట, ఫిబ్రవరి 6: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి నుంచి కాగజ్ఘట్ వరకు చేపట్టిన బీటీ రోడ్డు విస్తరణ పనులను ప్రభుత్వం ఆగమేఘాల మీద కొనసాగిస్తున్నది. సోమవారం రాత్రికి రాత్రే.. అధికారులు పనులను ప్రారంభించారు. ఇదంతా.. సీఎం రేవంత్రెడ్డి రాక కోసమే చేస్తున్నట్టు స్పష్టమవుతున్నది. వాస్తవానికి ఆరు నెలల క్రితమే ఈ రోడ్డు విస్తరణ కోసం అప్పటి సీఎం కేసీఆర్ రూ.2 కోట్ల 75 లక్షల నిధులు మంజూరు చేశారు. నాలుగు నెలలపాటు రోడ్డును తొవ్వారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పనులను నిలిపేసింది. నిత్యం దుమ్ము, దూళితో వాహనదారులు, గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదు. రోడ్డును బాగుచేయాలనే ఆలోచన ఏ ఒక్క అధికారికీ రాలేదు. కానీ.. కాగజ్ఘట్ సమీపంలోని సిరి నేచర్స్ రిసార్టులో బీహార్ రాష్ర్టానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం భారీ బందోబస్తుతో ఆశ్రయం కల్పించిన నేపథ్యంలో.. వారిని కలుసుకునేందుకు సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 9న వస్తుండటంతో ఈ రోడ్డు పనులను రాత్రి, పగలు తేడా లేకుండా చేస్తున్నారని విమర్శలొస్తున్నాయి. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలిన అధికారులు.. రోడ్డు పనులు ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిదని కాంట్రాక్టర్లకు చెప్పడంతో.. వారు ఇష్టాను సారంగా పనులు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బీహార్ రాష్ర్టానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తున్న ఎమ్మెల్యేల బృందానికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అమ్రాబాద్ మండలం మన్ననూర్ వనమాలిక గెస్ట్హౌజ్లో పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. నల్లమల అటవీ ప్రాంతం, శ్రీశైలం ఆలయం గురించి వారికి వివరించారు.