నల్లగొండ : ఇటీవల మరణించిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం చిత్రపటానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందా కారత్ నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాయుధ పోరాట వీరనారి, పేద ప్రజల కోసం చివరి వరకు తపించిన మల్లు స్వరాజ్యం మరణం బాధాకరం అన్నారు. ఆమె ప్రజల మనసుల్లో చిరస్థాయిగా జీవించి ఉంటారని పేర్కొన్నారు.
కేవలం తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా మహిళా పోరాటాలకు స్ఫూర్తి మల్లు స్వరాజ్యం అన్నారు. నైజాంకి వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి నాటి రోజుల్లోనే మహిళల పోరాట పటిమ ను ప్రపంచానికి చాటిన వీరనారి అని ప్రశంసించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం బందూకు పట్టి పోరాటం చేశారన్నారు. జీవించినంత కాలం ప్రజల కోసం, పోరాటాలే జీవితంగా స్వరాజ్యం నిలిచారన్నారు.
సంప్రదాయాల పేరుతో మహిళలను ఇంటికే పరిమితం చేసిన కాలంలోనూ ప్రపంచ స్థాయి గెరిల్లా పోరాటంలో ముందుండి నడిచారు. స్వరాజ్యం ఒక కమ్యూనిస్టుగా.. మార్క్సిస్టుగా నిరంతర పోరాటశీలిగా నిలిచారని ఆమె తెలిపారు. దేశ వ్యాప్తంగా భవిష్యత్ ఉద్యమాలకు స్వరాజ్యమే మా స్ఫూర్తి అని తెలిపారు.