నిజామాబాద్/బోధన్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పార్టీ అంటే ఇంటి పార్టీలాంటిదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ప్రజలతో పేగుబంధం ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులకు ప్రజలంటే ఒక కుటుంబంలా కనిపిస్తే, ప్రతిపక్ష పార్టీలకు ఓట్లేసే ఈవీఎం యంత్రాల్లా కనిపిస్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ది పేగు బంధమైతే ప్రతిపక్షాలది ఓటు బంధమని అభివర్ణించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. అంతకు ముందు ఏఆర్ గార్డెన్ నుంచి నిజాం షుగర్ ఫ్యాక్టరీ మైదానం వరకు కార్యకర్తలతో కలిసి కవిత, షకీల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో కార్యకర్తలను ఉద్దేశించి కవిత మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని పేర్కొన్నారు. 24 గంటలు కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలా? 3 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా? ఎవరు కావాలో తేల్చుకోవాలని సూచించారు.
కాంగ్రెస్కు ఓటెందుకు వేయాలి?
కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని 62 ఏండ్లు పాలించి గరీబీ హఠావో అన్న నినాదాలు మాత్రమే ఇచ్చిందని కవిత ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ వెంట ఎందుకెళ్లాలి? వారికి ఎందుకు ఓటెయ్యాలో ప్రజలంతా ఆలోచించాలని సూచించారు. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి హజ్యాత్రకు వెళ్తే ఎలా ఉంటుందో.. రాహుల్గాంధీ జోడో యాత్ర కూడా అలాగే ఉన్నదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ముస్లింలు కేవలం కారు, సర్కారు అని మాత్రమే ఆలోచన చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం కేసీఆర్ చేతిలో సురక్షితంగా ఉన్నదని పేర్కొన్నారు. మైనార్టీ వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా నియమించిన గొప్పతనం కేసీఆర్దేనని గుర్తు చేశారు. ఖమ్మం సభలో రాహుల్గాంధీ ఇచ్చిన వాగ్దానాలపై మండిపడ్డారు. పెన్షన్ రూ.4 వేలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పడం బోగస్ అని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రూ.750 మాత్రమే పెన్షన్ ఇస్తున్నారని, వారి అబద్ధాలను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు.
ఒక్క చెరువు బాగు చేసిండా?
బోధన్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రిగా పని చేసిన సుదర్శన్రెడ్డి బోధన్లో ఒక్క చెరువును కూడా బాగు చేయలేదని కవిత విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ 152 చెరువులను బాగు చేసుకొన్నామని చెప్పారు. బోధన్లో 4,500 మహిళా సంఘాలకు 2014 నుంచి ఇప్పటివరకు రూ.2,600 కోట్లు రుణాలు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో లక్షా 30వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేస్తున్నామని, ఏ బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో 30 లక్షలకు పైగా ప్రైవేటు ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. ఐటీ హబ్ ద్వారా నిజామాబాద్లో ప్రారంభం రోజే 250 మందికి ఉద్యోగాలిచ్చినట్టు గుర్తుచేశారు. నిజామాబాద్ యువత కోసం ఈ నెల 29న పెద్ద ఎత్తున జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో 50 పెద్ద కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు.
ఎన్నికలకు ముందే విక్టరీ ర్యాలీ..
బోధన్ పట్టణంలో నాలుగైదు కిలోమీటర్ల మేర కవిత, షకీల్ పాదయాత్ర నిర్వహించారు. వీరి వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. తన ప్రసంగంలో ర్యాలీని గుర్తు చేస్తూ ఎన్నికలకు ముందే షకీల్ విక్టరీ ర్యాలీలా కనిపించిందని అన్నారు. ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్టు కాకుండా విజయోత్సవ ర్యాలీలా కనిపించిందని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పోచయ్య తన అనుచరులతో కవిత సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. త్వరలోనే గడపగడపకు బీఆర్ఎస్ పార్టీ రూపంలో కార్యక్రమాలను చేపట్టబోతున్నట్టు ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత రాంకిషన్రావు, జడ్పీ వైస్ చైర్పర్సన్ రజిత యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కమ్మ వారి భాగస్వామ్యం అవసరం
తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశంలో పెంచిన ఎన్టీఆర్ మాదిరిగానే ఆయన శిష్యుడైన కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దేశంలో ఇనుమడింపజేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టే క్రమంలో కమ్మ కులస్తుల సహకారం, భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు. బుధవారం బోధన్లోని కమ్మ సంఘ భవనంలో జరిగిన ‘కమ్మ సంఘం ఆత్మీయ సమ్మేళనం’లో ఆమె మాట్లాడారు. ‘సెటిలర్స్’ అన్న పదం సరికాదని, ఇక్కడే స్థిరపడిన మనమంతా ఒక్కటేనని కవిత తెలిపారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కమ్మ కులస్థులు తనకు ఎంతో మద్దతు ఇచ్చారని, తన గెలుపు కోసం ఊరూరా తీర్మానాలు చేశారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వానికి కమ్మ కులస్తులు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు.
నాడు ఆత్మహత్యల తెలంగాణ..నేడు వడ్ల తెలంగాణ..
ఉమ్మడి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ అగ్రభాగంలో ఉండేదని, ఇప్పుడు వడ్ల తెలంగాణగా రాష్ట్రం మా రిందని కవిత పేర్కొన్నారు. ‘ఏ సూచీ చూసుకున్నా తెలంగాణ రాష్ట్రమే నంబర్ వన్గా నిలుస్తున్నది. ఇదంతా ఎట్లా సా ధ్యమైంది? ఎవరితో సాధ్యమైందో ఆలోచన చేయాలె. తెలంగాణలో గులాబీ విప్ల వం వచ్చింది. ప్రజల ఇంటికి సంతోషం, ఆనందం, సంక్షేమ పథకాలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో బోధన్లో షకీల్ను భారీ మెజార్టీతో గెలిపించండి. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే భారీగా మెజార్టీ రావాలి’ అని అన్నారు.