Sagaraharam | హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మిలియన్ మార్చ్ తర్వాత అంత గొప్పగా జరిగిన నిరసన కార్యక్రమం సాగరహారం. 2012, సెప్టెంబర్ 30న తలపెట్టిన సాగరహారానికి నేటితో 13 ఏండ్లు పూర్తయింది. నాటి ఆ కార్యక్రమాన్ని గుర్తు చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో చిరస్థాయిగా గుర్తుండిపోయే పోరాట రూపాల్లో సాగరహారం ఒకటి. ఆంక్షలను ఎదురించి, నిర్బంధాలను ఛేదించి, రబ్బర్ బుల్లెట్లకు ఎదురొడ్డి తెలంగాణ ఉద్యమకారులు స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిన ఉద్వేగభరిత ఘట్టం సాగరహారం. ఉద్యమకారులను అడ్డుకుందామన్న సమైక్య పాలకుల కుట్రలను పటాపంచలు చేస్తూ… లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు “జై తెలంగాణ” అని గొంతెత్తి, కవాతు చేస్తూ ఉద్యమస్ఫూర్తిని చాటిన ఉద్విగ్న సందర్భం సాగరహారం అని కేటీఆర్ పేర్కొన్నారు. నేటితో సాగరహారానికి 13 ఏళ్లు నిండాయన్నారు. చివరకు కేటీఆర్ జై తెలంగాణ అని నినదించారు.