KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని సుల్తాన్పూర్ మెడికల్ డివైసెస్ పార్క్లో హ్యూవెల్ (Huwel) సంస్థ ఏర్పాటు చేసిన నూతన కెమిస్ట్రీ ల్యాబ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాంత బయోటెక్ ఎండీ వరప్రసాద్ రెడ్డి, హ్యూవెల్ కంపెనీ ఎండీ, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ.. తెలంగాణ మెడికల్ డివైసెస్ పార్క్ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. “మన దేశంలో 70 నుంచి 80 శాతం మనం వాడే మెడికల్ పరికరాలన్నీ కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అట్లా ఎందుకు ఉండాలి? మన దేశంలో ఎందుకు ఈ ఉత్పత్తులు కాకూడదు?” అనే ఆలోచనతో కేసీఆర్ ప్రభుత్వంలో ఈ మెడికల్ డివైసెస్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. మన దేశంలో ఉత్పత్తి అయితే ధర కూడా తగ్గి, సామాన్యుడికి ఇవన్నీ అందుబాటులోకి వస్తాయన్న ఉద్దేశంతోనే దీనిని ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు.
పార్క్ ఏర్పాటుకు ముందు సుల్తాన్పూర్ ఏరియాలో స్టోన్ క్రషర్లు, మెటల్ క్రషర్లు, కొంత ఖాళీ జాగా తప్ప ఏమీ లేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఇక్కడికి వస్తే వేల మంది పని చేస్తుండటం, అనేక పరిశ్రమలు రావడం చూసి చాలా సంతోషం అనిపించిందని అన్నారు. ఇక్కడ జరిగిన పరిశోధనలు, ప్రవేశపెట్టిన ఉత్పత్తులు చూస్తే తనకు విశ్వాసం కలిగిందని తెలిపారు.
కోవిడ్ సమయంలో ఆర్టీపీసీఆర్ (RTPCR) టెస్ట్లకు, కోవిడ్ కిట్స్కు విపరీతమైన గిరాకీ, డిమాండ్ ఉండేదని, ఆ రోజుల్లో టెస్ట్ కిట్ కావాలంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ, హ్యూవెల్ సంస్థకు చెందిన శిశిర్ గారు, రచన గారు, వారి బృందం మొత్తం కలిసి అప్పట్లో రూ. 6,000 ఖర్చయ్యే ఒక టెస్ట్ ధరను కేవలం రూ.12కు తగ్గించామని చెప్పడం అద్భుతమని కొనియాడారు. పోర్టబుల్ ఆర్టీపీసీఆర్ కిట్ వంటి ఉత్పత్తుల ద్వారా ధరలు తగ్గించి సామాన్యుడికి మేలు చేసే పరిశోధనలు, కార్యక్రమాలు చేస్తున్నందుకు కేటీఆర్ హ్యూవెల్ బృందాన్ని అభినందించారు.
“సామాన్యుడికి ఫలాలు అందించని పరిశోధన నిష్ఫలం, దాని వల్ల వ్యర్థం,” అని కేసీఆర్ తమకు ఎప్పుడూ చెప్తుంటారని కేటీఆర్ తెలిపారు. సాంకేతికత (టెక్నాలజీ) ఉన్నా దాని వల్ల సామాన్యుడికి లాభం జరగకపోతే అది వేస్ట్ అని కేసీఆర్ సందేశాన్ని ఆయన పునరుద్ఘాటించారు. హ్యూవెల్ సంస్థకు ఇది పదవ వార్షికోత్సవం సందర్భంగా కేటీఆర్ బృందాన్ని అభినందించారు.
“మీరు మేము కలిసి హైదరాబాద్ని, తెలంగాణాని, భారతదేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటున్నాను,” అని కేటీఆర్ ఆకాంక్షించారు. “మరో రెండేళ్లలో మేము అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత ఇంకా బాగా చేస్తాం,” అని ఆయన అన్నారు.