KTR | కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఐదేండ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్కు ఒక్క గుడి తెచ్చిండా? ఒక్క బడి తెచ్చిండా అని ప్రశ్నించారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ స్థాయి సోషల్మీడియాలో వారియర్స్తో బుధవారం జరిగిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. పార్లమెంటు సభ్యుడిగా కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశావని నిలదీశారు. దమ్ముంటే ఐదేండ్లలో చేసిన అభివృద్ధిపై బోయిన్పల్లి వినోద్కుమార్తో చర్చకు రావాలని సవాలు విసిరారు.
కరీంనగరోళ్లు క్యాలెండర్ కొనుక్కుంటే అయిపోతుండే..
ఐదేండ్లలో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ చేసింది ఏందంటే.. మనకు క్యాలెండర్ గురించి మాత్రం మంచిగ చెప్పిండు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అన్నా.. ఇవాళ ఏ వారం అన్న? అంటూ బండి సంజయ్ గతంలో చేసిన ప్రసంగాన్ని ప్రదర్శించారు. ఇవాళ ఏ వారం అన్న.. రేపు ఏ వారం అన్న.. గిదేనా.. గీపాటి దానికి కరీంనగరోళ్లు క్యాలెండర్ కొనుక్కుంటే అయిపోతుండే.. ఎంపీ ఎందుకు అంటూ చమత్కరించారు.
అకుంటిత భక్తితో కొలిచేవాళ్లు దేవుడిని రాజకీయాల్లోకి గుంజరు
‘బండి సంజయ్ మాట్లాడినా.. బీజేపీ మాట్లాడినా.. ఎట్లుందంటే.. వాళ్లు వచ్చినంకనే మనకు బొట్టు పెట్టుడు నేర్పిండ్రు.. వాళ్లు వచ్చినంకనే మనకు గుళ్లకు పోవుడు అలవాటు అయ్యింది.. వాళ్లు వచ్చినంకనే దేవుడిని మనకు పరిచయం చేసినట్టు బిల్డప్ ఇస్తరు’ అని కేటీఆర్ అన్నారు. మనం కూడా హిందువులమే.. మనం కూడా హిందూ ధర్మాన్ని బలంగా నమ్మేవాళ్లమే అని తెలిపారు. కానీ వాళ్లలా దేవుడిని ఏనాడూ రాజకీయంగా వాడుకోలేదని స్పష్టం చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రపంచమే అబ్బురపరిచే విధంగా కట్టినా.. దాన్ని రాజకీయం చేయాలని కేసీఆర్ ఏనాడు ప్రయత్నం చేయలేదని వివరించారు. దేవుడిని, ధర్మాన్ని శ్రద్ధతో.. అకుంటిత భక్తితో కొలిచేవాళ్లు దేవుడిని రాజకీయాల్లోకి గుంజరని అన్నారు. బండి సంజయ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఐదేండ్లలో కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఏం చేశారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే సత్తా ఉందా? అని నిలదీశారు. స్థలం మీరు చెప్పండి.. టైమ్ మీరు చెప్పండి.. మీరు ఎక్కడికి చెబితే అక్కడికి మా వినోద్ అన్న వస్తడు. వినోద్ అన్నతో ముఖాముఖి బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాలు విసిరారు. హిందీ, ఇంగ్లిష్, తెలుగు ఏ భాషలో మాట్లాడుతావో నీ ఇష్టమని అన్నారు.
ఒక్క గుడి కట్టలే.. ఒక్క బడి కట్టలే..
మాట్లాడితే మతం అనే బండి సంజయ్.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వేములవాడ రాజన్న ఆలయం.. ఇల్లందకుంట రామాలయం, కొండగట్టు అంజన్న ఆలయాలకు ఐదు పైసలు అయినా తెచ్చిండా అని కేటీఆర్ ప్రశ్నించారు. నీ నియోజకవర్గంలోని మూడు గుడులకు నరేంద్ర మోదీని అడిగి ఐదేండ్లలో ఐదు పైసలు అయినా తెచ్చావా? అని నిలదీశారు. ఒక్క గుడి కట్టలే.. ఒక్క బడి కట్టలేదని విమర్శించారు. ఏపీ సీఎం జగన్, టీటీడీ బోర్డు చైర్మన్ను కలిసి కరీంనగర్లో అద్భుతమైన అపురూపమైన వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని గంగుల కమలాకర్, బోయిన్పల్లి వినోద్కుమార్ కట్టించారని చెప్పారు. కానీ బండి సంజయ్ మాత్రం గుడికి పైసలు తేలేదు.. ఒక్క నవోదయ పాఠశాల తీసుకురాలేదని విమర్శించారు.
బండి సంజయ్ అట్టర్ప్లాఫ్ ఎంపీ
‘ వినోద్కుమార్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ట్రిపుల్ ఐటీ కరీనంగర్కు దాదాపు వచ్చినంత పనైంది. కానీ ఈలోపు ఎలక్షన్స్ వచ్చి ఆ పని ఆగిపోయింది. కనీసం ఆ ట్రిపుల్ ఐటీ అయినా చేయగలిగినవా?’ అని బండి సంజయ్ను కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు సాంక్షన్ అయిన కొత్తపల్లి-మనోహరాబాద్ రైలును అయినా తీసుకురాగలిగినవా? అని అడిగారు. ఇవాళ సిద్దిపేట దాటి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి రైలు కూడా అడుగుపెట్టలేదంటే.. బండి సంజయ్ చేతగానితనం కాదా? అని అన్నారు. బండి సంజయ్ అట్టర్ప్లాఫ్ ఎంపీ కాదా? అని అడిగారు. బండి సంజయ్ ఐదేండ్లు ఎంపీగా ఉంటే ఏం ఒరిగిందని ప్రశ్నించారు. లోక్సభ సభ్యుడిగా బండి సంజయ్ పార్లమెంటులో మాట్లాడడని అన్నారు. వినోద్కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు లోక్సభలో 570 ప్రశ్నలు అడిగితే.. ఆయన కేవలం 50 ప్రశ్నలే అడిగిండు అని తెలిపారు. ఇలాంటి ఎంపీ కావాల్నా? విద్యావంతుడైన మన తరఫున మన గళం, మన బలం, మన దళంగా విరుచుకుని పడే వినోద్కుమార్ కావాల్నో ఆలోచించుకోవాలని సూచించారు.