– ఘనంగా మాజీ ఎంపీటీసీ కుంటయ్య కూతురి వివాహాం
– అన్ని తానై… వివాహాం జరిపించిన కేటీఆర్
– వివాహా వేడుకులకు హాజరై… నూతన దంపతులకు ఆశీర్వాదం
– జీవితాంతం రుణ పడి ఉంటామన్న కుంటయ్య భార్య, కుటుంబసభ్యులు
KTR | సిరిసిల్ల రూరల్, ఆగస్టు 17 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ నేత కర్కబోయిన కుంటయ్య.. కాంగ్రెస్ నేతలు, పోలీసులు వేధింపులు తాళలేక ఈ ఏడాది జూన్ 16న రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నవిషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్లో కేటీఆర్ అన్న.. నా కుటుంబాన్ని ఆదుకో’ అని తన గోడు రాసి, ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో వెంటనే చలించిన కేటీఆర్, వెంటనే సిరిసిల్లలోని దవాఖానకు చేరుకుని, కుంటయ్య భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కుంటయ్య కుటుంబసభ్యులకు అండగా ఉంటానని, ఇద్దరు కూతుర్లు చదువుతోపాటు వివాహాలు, ఇతర అన్ని విషయాల్లో తానే చూసుకుంటానని భరోసా కల్పించారు. ఈక్రమంలో కుంటయ్య దవాఖాన ఖర్చులు, అంత్యక్రియలు, పెద్ద కర్మ వరకు ఖర్చులు అందించి, పార్టీ నేతలతో నిర్వహించారు.
అదే విధంగా ఇటీవలే చిన్న కూతురు దీక్షతకు రూ. 3 లక్షల నగదును కేటీఆర్ అందించారు. రూ.3 లక్షలను దీక్షిత పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి, పార్టీ నేతల చేతుల మీదుగా బాండ్ను అందజేశారు. అదే విధంగా కుంటయ్య మృతి చెందకముందే పెద్ద కూతురు భార్గవి వివాహం నిశ్చయమైంది. ఈక్రమంలో ఆదివారం కుంటయ్య పెద్ద కూతురు భార్గవి వివాహాం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఘనంగా జరిపించారు. కుంటయ్య కూతురు వివాహానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించి, వివాహా వేడుకల ఖర్చులు తానే వెచ్చించి, తెలంగాణ భవన్లో ఘనంగా జరిపించారు. ఈ వివాహా వేడుకలకు కేటీఆర్ హాజరై, నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ కు కుంటయ్య భార్య విజయ, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం తాము రుణపడి ఉంటామని పేర్కొన్నారు. కుంటయ్య కుటుంబానికి ఇచ్చిన మాటను కేటీఆర్ నిలబెట్టుకోవడం, కుటుంబానికి అన్ని తానై కేటీఆర్ నిలవడంపై పార్టీ నేతలు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటీ నర్సింగరావు, మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, సింగిల్ విండో చైర్మన్ బండి దేవదాస్ గౌడ్, మాజీ జడ్పీటీసీ కోడి ఆంతయ్య, మాట్ల మధు, వలకొండ వేణుగోపాలరావు, జక్కుల నాగరాజు యాదవ్, ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, మీరాల భాస్కర్ యాదవ్, ఆడ్డగట్ల భాస్కర్, కుర్మ రాజయ్య, బాలయ్య, పర్శరాములు, ఆత్మకూరి చంటియాదవ్, మోతే మహేష్ యాదవ్, నాంపల్లితోపాటు తదితర నేతలు ఉన్నారు.