KTR | హైదరాబాద్ : పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనవాళ్లు చెరిపేస్తామనడం అనాగరిక చర్య అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంచి పనులను ఆదరించాలి.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభలో కేటీఆర్ ప్రసంగించారు.
ఇవాళ నష్టపోయింది కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ కాదు. ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది ప్రజలకు. ఔటర్ లోపల కాంగ్రెస్, బీజేపీ ఎత్తుగడలకు ప్రజలు మోసపోలేదు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు ఇవ్వలేదు. గోషామహల్ కూడాపోయేది కాదు.. ఆగమాగం వల్లే పోయింది. ప్రజలు ఎప్పుడైనా మంచి పనులను ఆదరిస్తారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
తులం బంగారం కోసం ఆడబిడ్డలు ఆశపడ్డారు. రైతుబంధు రూ. 15 వేలు అని చెప్పేసరికి రైతులు కూడా ఆశపడ్డారు. రూ. 2 లక్షల రుణాల వరకు మాపీ చేస్తామని చెప్పేసరికి ఆశపడ్డారు. రూ. 4 వేల పెన్షన్ ఇంటికి ఇద్దరికి ఇస్తామని చెప్పేసరికి ఆశపడ్డారు. తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతానని రాహుల్ గాంధీ అశోక్ నగర్లో ఫోజులు కొట్టి చెప్పేసరికి.. మనం ఇచ్చిన 1 లక్షా 60 వేల ఉద్యోగాలు మరిచిపోయారు. పిల్లలు కూడా కొంత టెంప్ట్ అయ్యారు. 420 వాగ్దానాలు చేసి మోసం చేశారు కాంగ్రెసోళ్లు. డిక్లరేషన్ల పేరిట మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తినే పల్లెంలో మన్ను పోసుకున్నట్టు అయింది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎవరూ అధికారంలోకి వచ్చినా.. గత ప్రభుత్వం చేసిన మంచి పనులను అభినందించాలి. ఆనాడు ఆరోగ్య శ్రీని కొనసాగిస్తానని కేసీఆర్ చెప్పారు.. చేసి చూపించారు. ఫీజు రియింబర్స్మెంట్ కూడా కొనసాగించాం.. ఇవి రాజశేఖర్ రెడ్డి తెచ్చినవే కదా.. మరి మనం వాటిని రద్దు చేశామా..? చేయలేదు అని కేటీఆర్ గుర్తు చేశారు. ఇవాళ చంద్రబాబు జన్మనదినం.. హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఆయన ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు. సంస్కారవంతమైన ప్రభుత్వం గత ప్రభుత్వాలను గౌరవిస్తూ ప్రవర్తిస్తది అని కేటీఆర్ తెలిపారు.
మేం పదేండ్ల ఉన్నాం.. ఆనవాళ్లు చెరిపేస్తాం అనలేదు. అది అనాగరిక చర్య. కాకతీయుల ఆనవాళ్లను కుతుబ్షాహీలు, అసఫ్జాహీలు కూడా చెరిపేయలేదు. కానీ ఈ ప్రభుత్వం కిరాతక పనులు చేస్తుంది. మంచి పనులు చేయరు. చేసిన మంచి పనులను ఆపుతారు. అభివృద్ధికి అందరం సహకరిస్తాం. కానీ16 నెలల్లో విధ్వంసం జరిగింది. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అన్నారు.. 500 రోజుల తర్వాత కూడా ఏ ఒక్క హామీ అమలు కాలేదు. ఒక్కటే ఒక్కటి ఫ్రీ బస్సు అమలు చేశారు. ఇప్పటి వరకు చూడని చిత్రవిచిత్రాలు బస్సుల్లో చూస్తున్నాం అని కేటీఆర్ ఎద్దెవా చేశారు.