KTR | రంగారెడ్డి : శ్రీరాముడు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే కాదు.. రాముడు అందరివాడు.. అందరికీ దేవుడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ ఓడిపోయినా కూడా శ్రీరాముడికి ఏం కాదు అని కేటీఆర్ పేర్కొన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు.
ఈ పదేండ్లలో తెలంగాణ ఏం చేశారంటే బీజేపోళ్లకు చెప్పడానికి ఏం లేదు. ఏమన్న అంటే జైశ్రీరాం తప్ప ఇంకోటి లేదు. తెలంగాణకు ఒక్క కాలేజీ, పాఠశాల ఇవ్వలేదు. గుడికి పైసలు ఇవ్వలేదు. ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. శ్రీరాముడితో పంచాయితీ లేదు. రాముడు బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ కాదు.. రాముడు అందరివాడు.. అందరికీ దేవుడు. బీజేపీ ఓడిపోయిన తర్వాత కూడా శ్రీరాముడు మంచిగా ఉంటడు. ఏం ఫరక్ పడదు. మతం పేరుతో రాజకీయం చేయడం, ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని కేటీఆర్ సూచించారు.
ఆడబిడ్డలు ఆలోచించి ఓటేయాలి. 2014లో మోదీ ప్రధాని అయినప్పుడు సిలిండర్ ధర తక్కువగా ఉండే. ఇప్పుడు పెంచిండు. మోదీ దేవుడు అని బండి సంజయ్ అంటుండు. మోదీ ఎవరికి దేవుడు..? పెట్రోల్ ధరల పెంచినందుకా..? సరుకు రవాణా ఛార్జీలు పెంచి నిత్యవసరాలు పెంచి బతుకులు ఆగం చేసినందుకు దేవుడా..? జై శ్రీరాం అంటే మనందరం మొక్కుదాం.. తెలంగాణకు నయా పైసా పని చేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే తొక్కుదాం.. బుద్ది చెబుదాం అని కేటీఆర్ అన్నారు.
కృష్ణా జలాల్లో మన వాటా తేల్చాలని పదేండ్ల నుంచి కేసీఆర్ అడిగితే ఇంతరకు స్పందన లేదు. వాటా తేల్చలేదు. నీటి చుక్క పంచలేదు. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వండి అంటే అది లేదు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. బీజేపీని అడ్డుకునేది ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమే. ఈటల, రఘునందన్ రావు, అర్వింద్, సోయం బాపురావును ఓడించిందెవరు. కిషన్ రెడ్డిని పోటీ చేసేందుకే భయపడేలా చేసిందే బీఆర్ఎస్ అన్న విషయం గుర్తుంచుకోవాలె. రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన వెంటనే చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఈ నియోజకవర్గంలో చేవెళ్ల మూడో స్థానానికి పరిమితం అవుతుంది అని కేటీఆర్ తెలిపారు.