KTR | హైదరాబాద్ : తెలంగాణలో కేసీఆర్తో బీజేపీ ఆటలు సాగలేదు.. సాగవు కూడా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాంతీయ శక్తులు బలంగా ఉండడం వల్ల ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో మోదీ ఆటలు సాగలేదని కేటీఆర్ పేర్కొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన యూత్ మీటింగ్లో కేటీఆర్ పాల్గొని రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా మాట్లాడారు.
ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదల రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అవసరమైతే రాజ్యాంగాన్ని తీసిపాడేయాలని ఆలోచిస్తున్నారు. రిజర్వేషన్లు ఉండాలంటే బీఆర్ఎస్ గెలవాలి. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టి.. అధికారం చేజిక్కించుకుంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు. బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని, జార్ఖండ్లో, తమిళనాడులో, ఢిల్లీలో కూడా ప్రభుత్వాలను పడగొట్టాలని ప్రయత్నం చేశారు. కేసీఆర్, కేజ్రీవాల్, మమత, హేమంత్ సోరెన్, స్టాలిన్ లాంటి నాయకుల వద్ద బీజేపీ ఆటలు సాగలేదు. ప్రాంతీయ శక్తులు బలంగా ఉండడం వల్లే మోదీ ఏం చేయలేకపోయారు. మోదీతో కొట్లాడే దమ్ము రాహుల్ గాంధీకి లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ పదేండ్ల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్కు ఒక్క పని కూడా చేయలేదు. దవాఖానా, గుడి కట్టలేదు. పరిశ్రమలు కూడా తేలేదు. ఓటు ఎందుకు వేయాలంటే రామ మందిరం కట్టామని చెబుతున్నారు. మతం పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు. రాముడు రాజధర్మం పాటించమని చెప్పారు. హిందువైనా, ముస్లిం అయినా ఒకటే తీరుగా చూడాలి. అదే విధంగా తెలంగాణ గుజరాత్ను కూడా ఒకటే తీరుగా చూడాలి. హైదరాబాద్కు వరద వస్తే ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. అదే గుజరాత్కు వరద వస్తే వెయ్యి కోట్లు సాయం చేసిండు. వాట్సాప్లో రామమందిరం, అయోధ్య ఫొటోలు రాగానే ఆగం కావొద్దు. కేసీఆర్ యాదాద్రి కట్టలేదా..? మరి కేసీఆర్ యాదాద్రిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయలేదు కదా..? ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేని మోదీకి ఎందుకు ఓటేయాలి..? కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. మరి ఈటల రాజేందర్కు ఎందుకు ఓటేయాలి..? అని కేటీఆర్ నిలదీశారు.