హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. ఇల్లిల్లూ ‘అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్’ అంటూ నినదిస్తున్నది. మహారాష్ట్రలో తెలంగాణ మాడల్ అమలు చేయాలనే డిమాండ్ పెరిగిపోతున్నది. రైతులు, రైతుకూలీలు, మహిళలు ప్రత్యేకించి యువకులు గ్రామగ్రామాన బీఆర్ఎస్ కమిటీల్లో భాగస్వాములవుతున్నారు. గ్రామపార్టీ, తొమ్మిది అనుబంధ కమిటీల్లో చేరిన వారి సంఖ్య ఇప్పటి వరకు 11 లక్షలు చేరుకున్నది. మరో 15 రోజులపాటు కమిటీల నియామక ప్రక్రియకొనసాగుతుందని, 30 లక్షల మంది గులాబీ సైన్యం సిద్ధం అవుతున్నదని బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం తెలిపారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రధాన కమిటీతోపాటు అనుబంధ కమిటీలను వేస్తూ దూకుడు పెంచింది. కిసాన్, విద్యార్థి, యూ త్, మహిళా, మైనారిటీ, ఓబీసీ, ఎస్సీఎస్టీ, శ్రామిక కమిటీలను నియమిస్తున్నది. చిన్నగ్రామాల్లో అయితే 11 మంది, పెద్దగ్రామా ల్లో అయితే 15 నుంచి 25 మంది చొప్పున కమిటీలను వేస్తున్నారు. ఒకో గ్రామంలో 9 కమిటీలు, ఆ కమిటీల్లో 90 నుంచి 150 మంది సభ్యులు ఉండేలా మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు దాదాపు 11 లక్షల మందితో ఆఫీస్ బేరర్ల నియామకం పూర్తి అయిందని మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం చెప్పారు.