Minister KTR | హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ రైతులను చంపి తినే రాబందు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖమంత్రి కే తారకరామారావు విమర్శించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అవసరం లేదని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్డి చేసిన ప్రకటన, కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమని మంగళవారం ఓ ప్రకటనలో ఆయన ధ్వజమెత్తారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ రద్దు చేసి, 3 గంటల కరెంట్ మాత్రమే ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ దుష్ట విధానాలకు పరాకాష్ఠ అని మండిపడ్డారు.
తెలంగాణ రైతుకు ఉచిత విద్యుత్తు ఊపిరిలాంటిదని.. రైతుల ఊపిరిని ఆపేస్తామని, అన్నదాత ఉసురు తీస్తామని చెప్పడం కాంగ్రెస్ రాక్షస బుద్ధికి నిదర్శమని ఆగ్ర హం వ్యక్తంచేశారు. నిన్నటిదాకా ధరణి రద్దు, రైతుబంధు వద్ద్దు అని ప్రకటించిన కాంగ్రెస్, ఇప్పుడు ఏకంగా ఫ్రీ కరెంట్ను ఎత్తివేస్తామని చెప్పి తన క్రూరమైన ఆలోచనను బయటపెట్టుకొన్నదని విమర్శించారు. ఉచిత విద్యుత్తుకు ఉరి వేసేందుకు గాంధీభవన్ కేంద్రంగా జరుగుతున్న కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని రైతాంగానికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపుతో మంగళవారం అనేకచోట్ల కాంగ్రెస్ దిష్టిబొమ్మలను రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు దహనం చేశారు. బుధవారం కూడా ఈ నిరసనలు కొనసాగనున్నాయి.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతులు పడ్డ కష్టాలు, అనుభవించిన బాధలను రాష్ట్రం ఎన్నటికీ మరచిపోదని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో కరువులు, కన్నీళ్లు, కటిక చీకట్లు, అప్పులు, ఆత్మహత్యలతో అన్నదాతలు అరిగోస పడ్డారని తెలిపారు. అర్ధరాత్రి, అపరా త్రి మోటర్లు పెట్టడానికి పోయి పాములు కాట్లతో, కరెంట్ షాకులతో మరణించిన కాం గ్రెస్ పాలనా కాలాన్ని తలుచుకునేందుకు కూడా రైతులు సిద్ధంగా లేరని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతాంగాన్ని రక్షించుకోవడానికి, వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి బయటపడేయడానికి సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. సాగుకు కరెంట్ ప్రాణప్రదమని గుర్తించి, విద్యుత్తు రంగంపై వేల కోట్లు వెచ్చించి వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును అందించిందని చెప్పారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, ఇతర ప్రాజెక్టుల వల్ల భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగి 27 లక్షల బోరుబావుల కింద అన్నదాతలు రెండు పంటలు పండించుకొని సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. రైతుపచ్చగా ఉంటే చూసి కండ్లు మండిన కాంగ్రెస్ శక్తులు, నిరంతరం ఏవో కుట్రలు చేస్తూనే ఉన్నాయని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపి సరారు ఉచిత విద్యుత్తును ఎత్తివేసి మోటర్లుకు మీటర్లు పెట్టాలని రాష్ట్రం మెడపై కత్తిపెట్టినా, బీఆర్ఎస్ ప్రభుత్వం లొంగిపోలేదని.. 24 గంటల ఉచిత కరెంట్ను కాపాడుకోవడం కోసం ఏకంగా రూ.30 వేల కోట్లను వదులుకొన్నదని గుర్తుచేశారు. తాము రైతుల ప్రయోజనాలపై రాజీపడబోమని తేల్చిచెప్పారు.
దేశానికే అన్నంపెట్టే స్థితికి ఎదిగిన తెలంగాణ అన్నదాతను చూసి కాంగ్రెస్ పార్టీకి కండ్లు మండుతున్నాయని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. రైతులు బాగుపడటం చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు పచ్చి విషం గకుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధరణి పోర్టల్ను రద్దుచేస్తామంటున్న కాంగ్రెస్, మళ్లీ నాటి బ్రోకర్లు, దళారుల భూదందాల కాలాన్ని తీసుకొస్తామని నిస్సిగ్గుగా ప్రకటించిందని దుయ్యబట్టారు. దీనికితోడు 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరమే లేదని మళ్లీ నాటి కాంగ్రెస్ చీకటి కాలాన్ని తెస్తామని సిగ్గులేకుండా చెప్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 24 గంటల వెలుగులను వదులుకుందామా? కటిక కాంగ్రెస్ చీకట్ల కాలాన్ని మళ్లీ తెచ్చుకుందామా? చైతన్యవంతమైన తెలంగాణ రైతులు ఆలోచించుకోవాలని కేటీఆర్ కోరారు. రైతులను పొడుచుకుతినటానికి కాచుకు కూర్చున్న కాంగ్రెస్ రాబందులను తరిమికొట్టి రైతుబాంధవులకు అండగా నిలవాలని కోరారు.