హైదరాబాద్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ): ప్రాజెక్టుల అప్పగింతపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవప్రదమైన పదవిలో ఉండి అవాస్తవాలు, అర్ధసత్యాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పునర్విభజన చట్టాన్ని రూపొందించినది ఎవరు? ఆ కమిటీలో ఉన్నది ఎవరని ప్రశ్నించారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని చట్టంలో పెట్టింది కాంగ్రెస్ కాదా? అని నిలదీశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి చేస్తున్నది అదేనని పేర్కొన్నారు. ఒకవేళ కాంగ్రెస్ ఆరోపణలే నిజమైతే రెండు నెలల క్రితం వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేంద్రానికి ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు.
ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసరికి మినిట్స్లో తప్పురాశారని, దాన్ని సవరించాలని బోర్డుకు లేఖ రాస్తామని కొత్త డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు. పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా ఆనాడు పోరాడింది బీఆర్ఎస్ పార్టీయేనని గుర్తుచేశారు. గొప్పవాళ్లను తిట్టినంత మాత్రాన గొప్పవారైపోరంటూ రేవంత్రెడ్డికి చురకలు అంటించారు. కరెంటు ఇవ్వక, ప్రాజెక్టుల్లో నీళ్లు విడుదల చేయక పంటలు ఎండిపోతుంటే దానికి కారణం కేసీఆరే అని చెప్పడం హాస్యాస్పందంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ 60 రోజులపాలనలో అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు, బూతులు తప్ప మరేమీ లేవని, రేవంత్రెడ్డి ఇకనైనా సీఎం హోదాకు తగ్గట్టుగా మాట్లాడాలని సతీశ్రెడ్డి హితవు పలికారు.