హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రాకతో ఆదిలాబాద్ ఆనంద తాండవం చేయగా.. నర్సాపూర్ నాట్యమాడింది. నిజామాబాద్లో జనసునామీ పోటెత్తింది. గురువారం ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్న ప్రజా ఆశీర్వాద సభల్లో జనహోరు కనిపించింది. సభాప్రాంగణాలే కాకుండా సభ నిర్వహిస్తున్న పట్టణ ప్రాంతాలు గులాబీమయం అయ్యాయి.
గులాబీ దళపతి, సీఎం కేసీఆర్కు ఆదిలాబాద్ జేజేలు పలికింది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లోని ఆదివాసీ గిరిజన, గిరిజనేతరులు వేలాదిగా సభలకు తరలివచ్చారు. ఆదిలాబాద్లోని డైట్ కళాశాల మైదానం, బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రచార సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగానికి జనం జై కొట్టారు. గోడలపై కూర్చొని, రోడ్లపై నిల్చొని సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ప్రజలు ఆసక్తిగా విన్నారు. సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో ప్రతిపక్షాల తీరును ఎండగడుతున్నప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ‘కరెంటు కావాల్నా? కాంగ్రెస్ కావాల్నా? రైతుబంధు కావాల్నా? రాబందులు కావాల్నా? అని కేసీఆర్ అడిగినప్పుడు కరెంటు, రైతుబంధు ఇచ్చే సర్కారు కావాలని ప్రజలు నినదించారు. కేసీఆర్ ఉర్దూ ప్రసంగానికి ముస్లిం మైనార్టీలు ఫిదా అయ్యారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లిలో, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో రెండు చోట్లా పోటాపోటీగా జనం హాజరయ్యారు. యువకులు, రైతులు, మహిళలు, వృద్ధులు, యువత.. అన్ని వర్గాల ప్రజలు జాతరకు పోయినట్టు సభలకు తరలివచ్చారు. కేసీఆర్ మాటలకు చప్పట్లు కొడుతూ.. ఈలలు వేస్తూ ఆమోదం తెలిపారు. ‘ఓట్ ఫర్ కార్.. జై కేసీఆర్… జై బీఆర్ఎస్’ నినాదాల హోరుతో సభా ప్రాంగణాలు మార్మోగాయి. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ‘కారు’ గుర్తుతో కూడిన ఫ్లకార్డులు సభల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారుల ఆటాపాటలకు సభికులు ఉర్రూతలూగారు. దేఖ్లేంగే…, గులాబీల జెండలే రామక్క పాటలతో సభా ప్రాంగణాలు దద్దరిల్లాయి.