సాగు సాగక మహారాష్ట్రలో ప్రతిరోజూ ఆరేడుగురు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని మనం బాధపడుతుంటే.. ప్రధానమంత్రి, ఈ దేశాన్ని నడిపే నాయకులు ఏం చేస్తున్నారు? ‘ఇది ఆఫ్రికా పులి, ఇది నమీబియా చీతా.. వీటిని చూసి సంతోషపడండి’ అని చెప్తున్నారు. ఇదా మన రైతుల ఆత్మహత్యలకు పరిష్కారం? కానేకాదు. రైతులు పులుల్లా మారాలి. సింహాల్లా గర్జించాలి. అంతవరకు మన సమస్యలకు పరిష్కారం దొరకదు.
మన జాతి..
కిసాన్ జాతి కావాలి
మన మతం..
రైతు మతం కావాలి
మన అస్త్రశస్ర్తాలు..
మన ఓటు కావాలి
మన లక్ష్యం..
కిసాన్ రాజ్యం కావాలి
– సీఎం కేసీఆర్
‘రైతన్నే పులి.. రణాన కదలాలి’ అన్న కేసీఆర్ మాట పెనుగాలై చుట్టుముడుతుండగా.. సమస్యల సుడిగుండంలో తలెత్తిన ఆవేదనే ఆవేశమై ఆవహిస్తుండగా.. మహారాష్ట్ర నడిగడ్డ ఔరంగాబాద్ సోమవారం ఉర్రూతలూగింది. మార్పుకోసం ముందే సిద్ధమైన తీర్పులా దుమారం రేపింది. కనిపించగానే కేరింతలు.. కేసీఆర్ ఆగేబడో.. హమ్ తుమ్హారే సాథ్ హై.. అంటూ సంఘీభావ నినాదాలు.. చెప్పిన మాటను చెవియొగ్గి వినే శ్రద్ధ.. తెలంగాణ మాడల్పై హర్షధ్వానాలు.. పొద్దుటినుంచి రాత్రిదాకా ఔరంగాబాద్ గులాబీ గుబాళింపుల రంగస్థలమైంది. రైతు నినాదాల రణస్థలమైంది. సభా ప్రాంగణమంతా శిగమెత్తి ఊగిపోయింది. సభా ప్రారంభానికి ముందునుంచే అబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాలతో నగరం నగరమే నగారాతో మారుమోగింది. కేసీఆర్కు మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు. స్పీచ్ ముగించి వెళుతున్న సందర్భంలో కూడా సభికులు పెద్దఎత్తున నినదించారు.