KCR | హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ప్రజల సాంస్కృతిక జీవనంలో ఆది పండుగైన ఉగాదికి ప్రత్యేక స్థానం ఉన్నదని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు శనివారం ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రైతన్నలు వ్యవసాయ పనులను ఈ పర్వదినాన ప్రారంభిస్తారని, వ్యవసాయనామ సంవత్సరంగా ఉగాది నిలుస్తుందని తెలిపారు.
ప్రకృతితో మమేకమై, సాగు, ఉత్పత్తి సంబంధాల్లో పరస్పర సహకారం ప్రేమాభిమానాలతో పాలుపంచుకొనే సబ్బండ వర్గాలకు ఉగాది గొప్ప పర్వదినం అని అభివర్ణించారు. ఈ పండుగ వేళ చెట్లు పచ్చగా చిగురిస్తూ ప్రకృతి నూతనోత్సాహాన్ని సంతరించుకొనే ప్రకృతిమాత ప్రజల జీవితాల్లో అదే నూతనోత్సాహాన్ని నింపాలని అభిలషించారు.
ఉగాది పచ్చడి మాదిరిగా జీవితంలో షడ్రుచులను ఆస్వాదిస్తూ ప్రతి సందర్భాన్ని ఎదుర్కోవడం ద్వారానే మంచి, చెడులు అర్థమై మానవ జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని అన్నారు. ఈ నూతన సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నలు, సబ్బండ జనుల సంక్షేమం దిశగా కార్యాచరణ చేపట్టి ప్రజల జీవితాల్లో మరింత గుణాత్మక మార్పును తీసుకురావాలని ఆకాంక్షించారు. సాగు, తాగునీరు పుష్కలంగా లభించాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరిసేలా దీవించాలని ప్రకృతిమాతను కేసీఆర్ ప్రార్థించారు.