Minister Niranjan Reddy | కాంగ్రెస్ పాలనలో కర్నాటక అంధకారంలో మగ్గుతోందని మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. ఆ పార్టీ గ్యారంటీలు పూటకోటి ఎగిరిపోతున్నాయన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే కర్నాటక అతలాకుతలం అవుతుందన్నారు. అవమానాలు, అవహేళలను ఎదుర్కొని పోరాడి తెలంగాణ సాధించుకున్నామని, తెచ్చుకున్న రాష్ట్రంలో కృష్ణ గోదావరి జలాలను బీళ్లకు మళ్లించుకున్నామన్నారు.
కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకున్నామని.. విద్య, వైద్యం, తాగునీళ్లు, సాగునీళ్లు, విద్యుత్ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించామన్నారు. స్వతంత్రం వచ్చాక ఇంత వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం లేదన్నారు. ప్రజల కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని వదిలేసి.. కాంగ్రెస్ మాటలు ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. తెలంగాణ గురించి అడిగితే ఇడ్లీనా..? దోశనా అని అధికార మదంతో అవమానకరంగా మాట్లాడి తెలంగాణ ప్రజలకు చేసిన గుండెకోతను మిగిల్చారని, కాంగ్రెస్ చేసిన గాయాలను ప్రజలు ఇంకా మరిచిపోలేరన్నారు.
ఆ పార్టీ పాలనలో అనుభవించి బాధలు, కష్టాలు ప్రజలకు తెలుసునని.. అప్పుడే వాటిని మరిచిపోయి కాంగ్రెస్ను ఆదరిస్తారనుకోవడం అత్యాశేనన్నారు. 38రోజుల తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనన్నారు. మూడోసారి అధికారం బీఆర్ఎస్దేనని సర్వేలు చెబుతున్నాయని స్పష్టం చేశారు. గత తొమ్మిదిన్నరేళ్లుగా ప్రజలతో ఉన్నామని.. వారికి ఏం చేయాలో చేశామని.. ఏం చేయాలో తెలుసునన్నారు.