హైదరాబాద్ జనవరి 14 (నమస్తే తెలంగాణ): జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్కు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరింత ఉత్సాహాన్నిచ్చారు. బీఆర్ఎస్ ద్వారా దేశ సేవకు పూనుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్కు ఏపీలోని ఆయన అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు పట్టణాలు, గ్రామాల్లో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, ఆయన పట్ల తమ అభిమానం చాటుకున్నారు.
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, విజయవాడ, కొత్తపేట, కడియం, కాకినాడ, ముమ్మిడివరం, ముకామల, యానాం, అవిడిరేవు తదితర ప్రాంతాల్లో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. ఆయా పట్టణాలు, జాతీయ రహదారుల వెంట వెలిసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సీఎం కేసీఆర్ ఏపీలో కూడా బీఆర్ఎస్ రాష్ట్రశాఖను ఏర్పాటు చేయడం, పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేస్తుండటంతో అభిమానుల్లో నూతనోత్సాహం కనిపిస్తున్నది. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతున్నది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చిన బంధువులు, స్నేహితులు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించుకుంటున్నారు.