హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి విఘాతం కలిగిస్తే సహించబోమని బీఆర్ఎస్ పార్టీ తేల్చిచెప్తున్నది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన పాలకులు వ్యక్తిగత లక్ష్యాల సాధనే పరమావధిగా పాలన సాగిస్తుంటే రాష్ర్టాన్ని సాధించిన పార్టీగా తాము ఊరుకోబోమని తెగేసి చెప్తున్నది. రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగం కానివారు, భావోద్వేగాలతో బంధాన్ని పెనవేసుకోనివారు అధికారం చేప్టటాక ఇష్టారీతిగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేస్తున్నది. ఉద్యమ సమయంలో సీమాంధ్రపాలకులు తెలంగాణ సంస్కృతిని ఛిన్నాభిన్నం చేసినట్టే, స్వరాష్ట్రంలోనూ అదే విధ్వంసం కొనసాగటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నది. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా రాష్ర్టాన్ని సాధించుకున్నామని, తమ నెత్తురులోనే ఉద్యమస్ఫూర్తి ఉన్నదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నది. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలని హితవు చెప్తున్నది. తాజాగా రేవంత్ సర్కారు ప్రజావ్యతిరేక దిశగా అడుగులు వేస్తున్నదని, బాధ్యతాయుత ప్రతిపక్షంగా తాము ప్రజల పక్షాన ఉంటామని స్పష్టం చేస్తున్నది.
రాజముద్రను మార్చేస్తామని, కొత్తగా రూపొందించే రాజముద్రలో రాచరికపు ఆనవాళ్లు ఏవీ ఉండవని, ప్రజా ఆకాంక్షలకు ప్రతీకలు మాత్రమే ఉంటాయని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. సీఎం చేసిన ఈ ప్రకటన రాజకీయవర్గాల్లోనే కాకుండా సాహితీవేత్తలు, బుద్ధిజీవులు, సామాన్య ప్రజలను కలవరానికి గురిచేసింది. సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. దేశంలో జనరంజక పాలనను అందించి సామాన్యులనే మాన్యులుగా చేసిన పాలకులు కాకతీయులు అని, అలాగే హైదరాబాద్ ఐకానిక్గా ఉన్న చార్మినార్ను రాజముద్రలోంచి తొలగిస్తున్నామనే నిర్ణయం దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. వరంగల్లోని కాకతీయ కళాతోరణం, చార్మినార్ వేదికగా తమ నిరసన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. అందులో భాగంగానే బుధవారం వరంగల్లో మాజీ ఎంపీ బోయినల్లి వినోద్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, నన్నపునేని నరేందర్ సహా బీఆర్ఎస్ నేతలు తమ నిరసన చేపట్టారు. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక అంశాలే కాకుండా కనీసం భౌగోళిక అంశాలు కూడా తెలియనివారు పాలకులు అయితే పరిస్థితి ఇలాగే ఉంటుందని కాంగ్రెస్ సర్కారు తీరుపై గళమెత్తారు. అలాగే గురువారం చార్మినార్ వద్ద తమ నిరసన చేపట్టనున్నారు. ప్రభుత్వం అప్పటికీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రజాఉద్యమాన్ని నిర్మిస్తామని హెచ్చరించింది. తెలంగాణ మహోన్నత చరితకు, మహోజ్వల వైభవానికి ఆనవాళ్లు కాకతీయులని పేర్కొంటూ ‘కొందరు నిర్మిస్తుంటారు, కొందరు కూలదోస్తుంటారు. ఏకంగా జీవితాలనే కూలదోస్తారు, ఆరు దశాబ్దాలపాటు అనన్య త్యాగాలతో పోరాడి సాదించుకున్న స్వరాష్ట్రాన్నీ కూలదోస్తారు’ అని కాంగ్రెస్ సర్కారు తీరుపై సాహితీలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
ఉమ్మడి రాష్ట్ర పాలనలో విధ్వంసానికి గురైన అనేక రంగాలు పదేండ్లలో పునరుజ్జీవనం దిశగా అడుగులు పడితే, వాటిని ఛిద్రం చేసే దిశగా రాష్ట్ర సర్కారు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నదని తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ, కుదుటపడుతున్న ప్రజాసమూహాలను విచ్ఛిన్నం చేయాలని చూడటం సరికాదని తెలంగాణ బుద్ధిజీవులు తప్పుపడుతున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ తక్షణ స్పందనను సాహితీవేత్తలు, చరిత్రకారులు స్వాగతిస్తున్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఆకాంక్షలను లేవనెత్తి స్వరాష్ట్రంలో పదేండ్లపాటు అధికారంలో ఉండి వాటిని పరిరక్షించిన బీఆర్ఎస్.. ఇప్పుడు ప్రతిపక్షంలోనూ ఉద్యమ బాధ్యతను విస్మరించకపోవటం చెప్పుకోదగిన పరిణామమని కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక పరిశోధనా విద్యార్థి పేర్కొన్నారు.