న్యూఢిల్లీ: నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై బీఆర్ఎస్ (BRS) ఎంపీలు నిరవసన తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను పార్టీ ఎంపీలు కలిశారు. యాజమాన్య బోర్డు తీసుకునే నిర్ణయాల వలన రాష్ట్రానికి కలిగే నష్టాల గురించి మంత్రికి విన్నవించారు. ప్రాజెక్టుల అప్పగింతపై తమకున్న అభ్యంతరాలను తెలుపుతూ లేఖను అందజేశారు. ప్రాజెక్టుల అప్పగింత వల్ల తెలంగాణకు పూడ్చలేని నష్టం జరుగుతుందన్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా ట్రిబ్యునల్లో విచారణ పూర్తయ్యేవరకు ఇరు రాష్ట్రాలకు 50:50 పద్ధతిలో నీటి కేటాయింపులు ఉండేలా చూడాలని కోరారు. అయితే కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ ప్రభుత్వమే ఒప్పుకుందని బీఆర్ఎస్ ఎంపీలతో మంత్రి అన్నారు.
కృష్ణానది యాజమాన్య బోర్డు తీసుకునే నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి కలిగే నష్టాల గురించి కేంద్ర మంత్రికి విన్నవించామని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు అన్నారు. కేఆర్ఎంబీ తీసుకునే నిర్ణయం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తాము చెప్పామని.. అయితే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్న తర్వాత ఇదేందని ఆయన తమను ప్రశ్నించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ ప్రజలు నష్ట పోతారని చెప్పారు. కృష్ణా బేసిన్లో ఉన్న జిల్లాల రైతన్నలు తీవ్రంగా నష్టపోతారని స్పష్టం చేశామని తెలిపారు. భవిష్యత్లో దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వెల్లడించారు. పార్లమెంట్లో ఈ విషయాన్ని చర్చకు లేవనెత్తుతామన్నారు.