హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): మత సంబంధ విషయాలను రాజకీయం చేయరాదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం రాజ్యసభలో ఆయన మాట్లాడారు. కొందరు హిందూయిజానికి తామే చాంపియన్లుగా ప్రచారం చేసుకుంటున్నారని, ఇది సరికాదని పేర్కొన్నారు. రాముడు ఎప్పటికీ తమ హృదయాల్లో ఉంటాడని, ఫిబ్రవరి 22కు ముందు కూడా రాముడిని పూజిస్తూనే ఉన్నారని, తాము నిత్యం పూజలు చేస్తామని చెప్పారు. అయినా అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ పేరుతో రాముడు అప్పుడే అవతరించినట్టుగా కొందరు ప్రచారార్భాటం చేశారని ఎద్దేవా చేశారు.
అంతా హిందువులే అయినప్పటికీ భిన్న సంస్కృతి, సంప్రదాయాలకు మన దేశం నిలయంగా ఉన్నదని పేర్కొన్నారు. తాము ద్రావిడులం అయినప్పటికీ ఉత్తరాదికన్నా దక్షిణాదిలోనే హైందవ ఆలయాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వారు కోరుకుంటున్న హిందూయిజాన్ని వ్యతిరేకించే వారిని, వారికి గిట్టనివారిని యాంటీ నేషనల్స్గా చిత్రీకరించడం సరికాదని హితవు పలికారు. ఒకరి విశ్వాసాలను మరొకరు గౌరవించాలి తప్ప కించపరచరాదని కోరారు. అందరూ హిందువులే అయినా అందులో కొందరిని తమ పక్కన కూర్చోనివ్వరని, వారితో కలిసి భోజనం చేయరని, ముట్టుకోరని చెప్పారు. అయినా ఎటువంటి వివక్ష లేనివిధంగా అందరూ సమానమే అని రాజ్యాంగంలో పొందుపరిచారని గుర్తుచేశారు.