MLC Kavitha | హైదరాబాద్ : గ్రూప్-1 పరీక్షలు, ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గ్రూప్-1, 2, 3 పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో 11 విశ్వవిద్యాలయాల విద్యార్థులు ప్రతినిధులు ఆదివారం నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి చర్చించారు. తాము వ్యక్తపరుస్తున్న అనుమానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, శాసనమండలిలో ఈ అంశాన్ని లేవనిత్తాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థులు తన దృష్టికి తీసుకు వచ్చారని తెలిపారు. ట్రాన్స్లేషన్ సమస్య వల్ల ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని, తద్వారా మార్కుల్లో వ్యత్యాసాలు ఏర్పడ్డాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. గ్రూప్ 1 పరీక్షల్లో ప్రిలిమ్స్ కి ఒక హాల్ టికెట్ నంబరు, మెయిన్స్ కి మరొక హాల్ టికెట్ నంబరు కేటాయించడం వల్ల విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ప్రస్తావించారు. అదే విధంగా, ఇటీవల పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో దాదాపు 13 వేల మంది అభ్యర్థుల ఫలితాలు వెల్లడించలేదని, ఏ కారణం చేత ఆ 13 వేల మందిని ఇన్వ్యాలిడ్గా ప్రకటించిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు డాక్టర్ సత్య, గౌతమ్, విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు డా. ఎల్చాల దత్తాత్రేయ, బొడ్డుపల్లి లింగం, అశోక్ యాదవ్, మంథని మధు, కేయూ నుండి శరత్ గౌడ్, గ్రూప్ 1 అభ్యర్థులు సింధు రెడ్డి, అనూష, సత్యవతి, రవీందర్ రాథోడ్, క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.