హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో తనకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే ఫేక్ ఆడియోతో కుట్రపన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, విప్ పాడి కౌశిక్రెడ్డి చెప్పారు. ఫేక్ ఆడియోతో ముదిరాజ్ల మనోభావాలు దెబ్బతింటే, ప్రత్యేకించి హుజూరాబాద్ నియోజకవర్గ ముదిరాజ్ సోదరులను క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సామాజిక వర్గానికి నిజాలు తెలియాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణభవన్లో బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తన పేరుతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఫేక్ ఆడియోపై డీజీపీని కలుస్తానని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. ఆ ఆడియో రికార్డును ఫోరెన్సిక్కు పంపాలని డీజీపీని కోరుతానని, అప్పుడు అసలు దోషులెవరో తెలుస్తుందని కౌశిక్రెడ్డి చెప్పారు.
ఎవరినీ కిడ్నాప్ చేయలేదు..
తనకు ఆ కులం, ఈ కులం అనే వ్యత్యాసమేమీ లేదని పాడి కౌశిక్రెడ్డి అన్నారు. అన్ని కులాలవారిపై తనకెంతో గౌరవం ఉన్నదని, ఆ విషయం హుజూరాబాద్లో అందరికీ తెలుసని పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ముదిరాజ్లకు దూరం చేయాలనే కుట్రలో భాగంగానే తన పేరుతో ఫేక్ ఆడియోను సృష్టించారని తెలిపారు. తానొక కెమెరామెన్ను కిడ్నాప్ చేశానని అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఆ కెమెరామెనే తన ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చి భోజనం చేసి మళ్లీ బయటికి వెళ్లిపోయాడని, ఆ వీడియోను అందరి ముందు ఉంచానని గుర్తు చేశారు. అందులో కెమెరామెన్ వెళ్లేటప్పుడు ఒక చెక్కు దొంగతనం చేసి వెళ్లడం క్లియర్గా కనిపిస్తున్నదని తెలిపారు. అంతేతప్ప.. తాను ఎవరినీ కిడ్నాప్ చేయలేదని, అదంతా పచ్చి అబద్ధమని పేర్కొన్నారు.