MLA Rasamai Balakishan | తిమ్మాపూర్ : అబద్ధపు రాతల ఆంధ్రజ్యోతి విషప్రచారాన్ని ప్రజలు పట్టించుకోవద్దని, వారి రోత రాతలకు తోడు కాంగ్రెస్ నాయకులు అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. మంగళవారం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామంలో రూ.71 కోట్లతో నిర్మించనున్న డబుల్ రోడ్డు పనులకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి రసమయి బాలకిషన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో రసమయి ప్రసంగించారు.
ఇల్లంతకుంట మండలం సోమారంపేట బీఆర్ఎస్ నాయకుడు, సర్పంచ్ ఆనందరెడ్డి అనారోగ్యంతో చనిపోతే.. బిల్లులు రాకే ఆత్మహత్య చేసుకున్నాడని పని లేని కాంగ్రెస్ నాయకులు విషప్రచారం చేయడం సరికాదన్నారు. దానిని అంధజోతి రాయడం విడ్డూరమని మండిపడ్డారు. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడే రూ.5 లక్షల ఎల్వోసీ మంజూరుకు ప్రాసెస్ జరిగిందని, అంతలోనే ఆయన ఆరోగ్యం విషమించి మరణించారని చెప్పారు. దీనిని కాంగ్రెస్ నాయకులు వారి కుటుంబసభ్యులతో మాట్లాడించినట్లు.. ప్రభుత్వం మీద వ్యతిరేకంగా రాయించారని మండిపడ్డారు. కానీ, మాట్లాడిన మహిళ సర్పంచి భార్య కానే కాదని చెప్పారు. మాట్లాడిన మహిళ వికారాబాద్ కస్తూర్బా పాఠశాలలోని ఓ మహిళతో మాట్లాడించారని చెప్పారు. ఆ పత్రిక భార్యలనే మార్చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మరుసటి రోజు తమ తప్పును సవరణ వేశారని.. ఇలాంటి తప్పుడు రాతల వల్ల ప్రజలకు తప్పుడు సందేశం వెళ్తుందని.. ఇలాంటి విషరాతలను అసలే పట్టించుకోవద్దని రసమయి బాలకిషన్ కోరారు.