హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అనుభవరాహిత్యంతో తీసుకుంటున్న నిర్ణయాలతో తెలంగాణ ఎడారిగా మారుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. కేఆర్ఎంబీలో తెలంగాణ ప్రాజెక్టులను చేర్చవద్దని బీఆర్ఎస్ నేతలు నెల రోజులుగా హెచ్చరిస్తున్నా.. మన ప్రాజెక్టులను బోర్డులో చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ భవన్లో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, ఇరిగేషన్ శాఖ మంత్రికి మన ప్రాజెక్టులపై అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా.. కేఆర్ఎంబీలో తెలంగాణ ప్రాజెక్టులను చేర్చలేదని గుర్తుచేశారు. కేఆర్ఎంబీపై ఢిల్లీకి వెంటనే అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.