BRS MLA Jagadish Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర ఉందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఏడాదిన్నర క్రితం రెండు సార్లు నోటీసులు ఇచ్చినా విధిగా విచారణకు హాజరై విచారణ సంస్థలకు ఎమ్మెల్సీ కవిత సహకరించారని శుక్రవారం జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు. అవసరమైన డేటా ఇచ్చినప్పుడు ఆమె నిందితురాలు కాదని, సాక్ష్యానికి ఉపయోగపడుతుందని చెప్పిన ఈడీ అధికారులు ఏడాదిన్నర తర్వాత వచ్చి అరెస్ట్ చేయడం మోసపూరితం అని ఆరోపించారు.
ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడే ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితకు టికెట్ కొనుక్కుని వచ్చారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. తొలుత సోదాలు జరుపుతాం, డేటా చూస్తాం, 20 నిమిషాల్లో వెళ్లిపోతాం అని నమ్మ బలికి, తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరెస్ట్ చేయాల్సిందేననడం దౌర్జన్యపూరితం అని అని అన్నారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ సంస్థలన్నింటిని తనకు అనుకూలంగా పని చేయించుకుంటున్నదని తన జేబు సంస్థలుగా పని చేయించుకుంటున్నదని చెప్పడానికి ఇంతకు మించిన ఆధారం లేదన్నారు.
పీఎంఎల్ఏ చట్టం రూపొందించినప్పుడు మహిళలకు మినహాయింపు ఇవ్వాలని చర్చ జరిగిందని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు. దానిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందన్నారు. `మేం కవిత విచారణపై తీవ్రమైన చర్యలు తీసుకోబోం అరెస్ట్ చేయబోం అని సుప్రీం కోర్టు ముందు మౌఖికంగా హామీ ఇచ్చి ఈడీ.. ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లింది. బీజేపీ ఈ దేశంలో రాజకీయ ప్రత్యర్థులను లొంగ దీయడానికి, రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీయడానికి, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇటువంటివన్నీ చేస్తున్నదని ఈ పదేండ్లలో స్పష్టంగా అర్థం అవుతుంది. వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల వాళ్లకు ఎలా నోటీసులు ఇచ్చినరో తెలుసు.. వారు బీజేపీలో చేరగానే కేసులు క్లోజ్ చేయడం వందల ఘటనలు సూచినం` అని జగదీశ్ రెడ్డి చెప్పారు.
`ఇప్పుడు బీఆర్ఎస్ను, కేసీఆర్ను లొంగదీసుకోవాలని ప్రయత్నం చేసింరు. ఈ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ఒకరు నిలబడ్డరు. మిగతా ఎదురు నిలబడ్డ వారిపైన చేసినట్లే మా పైన చేసింరు. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత తప్పక బయట పడతారు. రాజకీయంగా వాడుకోవడానికి, మమ్ముల్ని ఇబ్బంది పెట్టడానికి ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా శనివారం నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు తెలుపాలని నిర్ణయించాం` అని జగదీశ్ రెడ్డి చెప్పారు.