హైదరాబాద్: కాంగ్రెస్ గూండాలే తనపై దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. కాంగ్రెస్ గూండాయిజానికి భయపడేది లేదని ఆయన అన్నారు. శనివారం రాత్రి కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడ్డ బాలరాజు హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆదివారం ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లు తన కాన్వాయ్ని వెంబడిస్తూ దాడి చేశారని గువ్వల చెప్పారు. తాను ఎవరికీ భయపడనని, ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసం పనిచేస్తానని అన్నారు. తన అనుచరులను చంపినంత పనిచేశారని ఆరోపించారు. అచ్చంపేటలో చిచ్చు పెడుతున్న వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. అచ్చంపేట పచ్చబడాలంటే సీఎం కేసీఆర్ మరోసారి ముఖ్య మంత్రి కావాలని అన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణనే తనపై దాడి చేయించాడని గువ్వల బాలరాజు ఆరోపించారు. దాడికి పాల్పడి ఇప్పుడు తాము దాడి చేయలేదని కాంగ్రెస్ అబద్ధం చెబుతోందని విమర్శించారు. తనపై దాడికి కుట్ర జరుగుతోందని 10 రోజుల క్రితమే తాను డీజీపీకి సమాచారం ఇచ్చానని గువ్వల వెల్లడించారు. దాడి ఘటనపై నాగర్కర్నూల్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు.
గువ్వల బాలరాజు అచ్చంపేట ప్రజల గుండెల్లో ఉన్నాడని ఆయన అన్నారు. క్యాడర్కు, క్యాడర్కు మధ్య కొట్లాటలు పెట్టడం కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదని గువ్వల హితవుపలికారు. వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలను ఆయన కోరారు. కాగా, శనివారం రాత్రి గువ్వల బాలరాజుపై దాడి జరిగింది.