ముదిగొండ, నవంబర్ 15: ఓటర్లను మభ్యపెట్టి గద్దెనెక్కేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ప్రజల్లో విలువే లేదని మధిర నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజు విమర్శించారు. బుధవారం ముదిగొండ మండలంలో టీఎస్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి చిరుమర్రి, పమ్మి, మల్లన్నపాలెం, గంధసిరి, పెద్దమండవ, బాణాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క.. నియోజకవర్గం అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని చెప్పారు. తన వల్లే దళితబంధు వచ్చిందంటూ భట్టి చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. దళితబంధు పథకం సృష్టికర్త సీఎం కేసీఆర్ మాత్రమేనని, ఆయన వల్లనే ఆ పథకం వచ్చిందని స్పష్టం చేశారు. అసలు దళితబంధు గురించి మాట్లాడే అర్హత భట్టికి ఎంతమాత్రమూ లేదని తెలిపారు. ఇక్కడి ప్రజలు భట్టిని మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏమీ చేయలేదని విమర్శించారు. తనకు ఒక్కసారి అవకాశమిస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని భరోసా ఇచ్చారు.